జ‌గ‌న్ నిర్ణ‌యంతో చంద్ర‌బాబు షాక్‌.. టీడీపీ పోటీలో ఉన్న‌ట్టా.. లేన‌ట్టా…?

-

విశాఖ సా్థ‌నిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌పై తెలుగుదేశం పార్టీ ఇంకా నాన్చుతోంది. నోటిఫికేష‌న్ విడుద‌లై నామినేష‌న్‌లు స్వీక‌రణ ప్ర‌క్రిక మొద‌లైనా ఇప్ప‌టివ‌ర‌కు అభ్య‌ర్ధిని ఖ‌రారు చేయ‌లేదు చంద్ర‌బాబునాయుడు. అధికారంలో ఉండి కూడా అభ్య‌ర్ధిని ఖ‌రారు చేయ‌క‌పోవ‌డంపై పార్టీ శ్రేణులు అసంతృప్తికి లోన‌వుతున్నారు. విశాఖకు చెందిన టీడీపీ నేతలు పోటీకి రెడీగా ఉన్నారు. అభ్యర్థిగా పీలా గోవింద్ సత్యనారాయణ పేరును ఫైనల్ చేసుకున్నారు.

అన్ని వివరాలతో చంద్రబాబు వద్దకు వెళ్ళ‌గా ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఖచ్చితంగా గెలిచేలా ఉంటేనే పోటీ చేద్దామని శ్రేణుల‌కు చెప్పిన‌ట్లు స‌మాచారం. అస‌లు ఎంత మంది ఓటర్లు ఉన్నారు.. ఎవరికి ఓటేస్తారు.. సహా మొత్తం సమగ్ర వివరాలతో రావాలని ఆదేశాలు ఇవ్వ‌డంతో వారు నిరుత్సాహానికి గుర‌వుతున్నారు. విశాఖ జిల్లాలోని మూడు నియోజకవర్గాల నుంచి స్పష్టత రావాల్సి ఉండటంతో నిర్ణయాన్ని వాయిదా వేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇదాలా ఉంటే మాజీసీఎం జ‌గ‌న్ ముందు జాగ్రత్తగా ఓట‌ర్ల‌ను క్యాంపుల‌కు త‌ర‌లించి చంద్ర‌బాబుకి షాక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అన‌గానే ముందస్తు జాగ్ర‌త్త ప‌డ్డారు జ‌గ‌న్. ముఖ్యంగా అరకు, పాడేరు నియోజకవర్గాల ఓటర్లను క్యాంపులకు తరలించారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా వారిని త‌న‌వ‌ద్ద‌కు పిలిపించుకుని బుజ్జిగించి ఎలాంటి ప్ర‌లోభాల‌కు లొంగ‌వ‌ద్ద‌ని చెప్పి క్యాంపుల‌కు పంపించారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ను జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు కాబ‌ట్టి నెలాఖ‌రు వ‌రకూ వారిని క్యాంపుల్లో ఉంచి నేరుగా ఓటింగ్ కు తీసుకు రావాలని నిర్ణయించుకున్నారు.

దీంతో టీడీపీ నేత‌లు నేరుగా ఓట‌ర్ల‌తో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డానికి వీలు లేకుండా పోయింది. చేసేదేమీ లేక చంద్ర‌బాబు కేడ‌ర్‌పై అస‌హ‌నం వ్య‌క్త‌ప‌రుస్తున్నారని తెలుస్తోంది. ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు ఎందుకు తీసుకోలేద‌ని వారిని ప్ర‌శ్నిస్తున్నారట‌. వైసీపీ ఓటర్లు .. జగన్ తో భేటీకి వెళ్లినా ఆ పార్టీకి ఓటు వేయలేదని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ అదే జరుగుతుందని అంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు అందరూ కూటమి నేతలేనని.. అలాగే ప్రభుత్వం కూడా చేతిలో ఉన్నందున.. వైసీపీ క్యాంపులకు వెళ్లిన ఓటర్లు కూడా చివరికి ఓటు దగ్గరకు వచ్చే సరికి కూటమికే వేస్తారని చెప్తున్నార‌ట‌. ఈ మేరకు తాము ఏర్పాట్లు చేసుకుంటామని అధినేత‌కు గ్యారంటీ ఇచ్చార‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం విశాఖ వేదిక‌గా జ‌రుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ జరిగితే.. రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతుంది. పూర్తి బలమున్నా అభ్యర్తి ఓడిపోతే వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. టీడీపీ ఓడిపోతే కావాల్సిన ఓట్లను మేనేజ్ చేసుకోవడం చేత కాలేదన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే పోటీ చేస్తే గెలిచి తీరాలన్న టార్గెట్ తో ఉన్నారు ఇరుపార్టీల అధినేత‌లు.

విశాఖ స్థానిక సంస్థల బలాబలాలను ఓసారి పరిశీలిస్తే వైసీపీకి 600 మంది సభ్యులుండగా టీడీపీ కేవలం 200 మంది ఓట‌ర్లు మాత్ర‌మే ఉన్నారు. వైసీపీ నుంచి ఓట‌ర్ల‌ను లాక్కునేందుకు టీడీపీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌కు సంబంధించి ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా 14న పరిశీలన, ఆగస్టు 16న ఉపసంహరణకు అవ‌కాశం ఉంది. ఆగస్టు 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉపఎన్నిక జరగనుంది. సెప్టెంబరు 3న ఫలితాలు రిలీజ్ కానుండగా సెప్టెంబరు 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.

Read more RELATED
Recommended to you

Latest news