సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు : రఘురామ

-

వైసీపీ నాలుగున్నరేళ్ల పాలన అవినీతిమయం అని ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అంటున్నారు. ఇప్పటికే సీఎం జగన్ పై ఉన్న కేసుల విషయం తేల్చాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన రఘురామ… తాజాగా, వైసీపీ పాలనలో చోటుచేసుకున్న అవినీతి నిగ్గు తేల్చాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ఆరోపించారు. ఈ మేరకు ఏ శాఖలో ఎలా అవినీతి జరిగిందన్న విషయాన్ని రఘురామ వివరంగా తన పిటిషన్ లో పేర్కొన్నారు.

Raghu Ramakrishna Raju Says He Is Unfit For Politics

ప్రజాధనానికి నష్టం కలిగించేలా ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని వివరించారు. సాక్షి పత్రిక, సాక్షి చానల్ కు లబ్ది కలిగేలా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. సీఎస్ సహా పలువురు ఐఏఎస్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని కూడా రఘురామ తన పిటిషన్ లో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మొత్తం 1,311 పేజీలతో రఘురామ న్యాయవాది ఉన్నం మురళీధర్ సుదీర్ఘ పిటిషన్ దాఖలు చేశారు. మద్యం ఇసుక, అంబులెన్స్ ల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. పోర్టులను అనుచరులకు కట్టబెట్టే క్రమంలో భారీ అవినీతికి పాల్పడ్డారని వివరించారు. టర్న్ కీ ఎంటర్ ప్రైజెస్ ద్వారా ఇసుక కుంభకోణానికి పాల్పడ్డారని ఆ పిటిషన్ లో తెలిపారు.

ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్‌రెడ్డి పై కేసులపై ఈనెల 3వ తేదీన సుప్రీంకోర్టు లో విచారణ జరగనున్నది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎన్వీఎస్ భట్టి ధర్మాసనం విచారణ చేపట్టనున్నది. అయితే జగన్‌రెడ్డి కేసుల విచారణను మరో రాష్ట్రానికి మార్చాలంటూ ఎంపీ రఘురామ సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ వేశారు. తెలంగాణ సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని ఎంపీ రఘురామ తెలిపారు. 3071 సార్లు జగన్ కేసును సీబీఐ కోర్టు వాయిదా వేసిందని కోర్టుకు రఘరామ తెలిపారు. జగన్ ప్రత్యక్ష హాజరుకు కూడా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చిందన్నారు. వందలకొద్ది డిశ్చార్జి పిటీషన్లు వేశారని… కేసు విచారణ మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని ఎంపీ రఘురామ పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news