‘సీతారామం’ సినిమా ట్రైలర్ రిలీజ్‌

-

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోన్న సినిమా “సీతారామం”.. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. దుల్కర్ సల్మాన్ రామ్‌గా.. బాలీవుడ్ బ్యూటీ మృణాళ్‌ ఠాకూర్‌ సీతగా నేషనల్ క్రష్ రష్మిక మంధన్న కీలక పాత్రలో నటిస్తున్న సీతారామం సినిమా ట్రైలర్ నేడు విడుదలయింది. ‘అందాల రాక్షసి’, ‘పడి పడి లేచె మనసు’ వంటి సున్నితమైన ప్రేమకథలను తెలుగు ప్రేక్షకులకు అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ ‘సీతారామం’ సినిమాను నిర్మించారు.

 

ట్రైలర్‌లో ఏముందంటే.. ఏళ్ల కిందట రామ్(దుల్కర్) రాసిన ఉత్తరాన్ని సీత(మృణాల్)కు చేర్చే బాధ్యతను రష్మిక తీసుకుంటుంది. ఈ సందర్భంగా ఆమెను కలుసుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఆమెకు సాయం అందించే పాత్రలో దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ కనిపించారు. ఇంతకీ సీతకు రామ్‌ ఆచూకీ తెలిసిందా? రామ్‌కు ఏమైంది? సీతకు రాసిన ఆ లేఖలో ఏముంది అనేది మిగతా కథ.

కొద్ది రోజుల కిందట విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముంచి ఫీల్ గుడ్ మూవీ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చేస్తుందనే ‘సీతా రామం’ చిత్రయూనిట్ అంటోంది. కశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఓ ఒంటరి సైనికుడికి.. ఓ యువతికి మధ్య నడిచే 1965 నాటి ప్రేమ కథ. ఇద్దరు అపరిచితుల మధ్య ఉత్తరాలతో ఏర్పడే స్నేహం.. ఎటువైపు వెళ్తుందనేది సినిమా చూస్తేనే అర్థమవుతుంది.

ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఇప్పటికే అంచనాలు పెంచేసింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. సుమంత్, భూమికా చావ్లా, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్‌ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news