బంగ్లాదేశ్ చిత‌క్కొట్టుడు.. విండీస్ దారుణ ప‌రాజ‌యం..

-

ప్ర‌పంచ క‌ప్ టోర్నీలో వెస్టిండీస్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడింది. వెస్టిండీస్ నిర్దేశించిన 322 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని బంగ్లాదేశ్ ఉఫ్ మ‌ని ఊదేసింది. కేవ‌లం 41.3 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్‌ 322 పరుగులు చేసి విండీస్‌పై 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ప్రపంచ క‌ప్‌లో బంగ్లాదేశ్ సౌతాఫ్రికాకు ఇచ్చిన షాక్ మ‌రిచిపోక‌ముందే ఇప్పుడు విండీస్‌కు షాకిచ్చింది.

మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు వ‌చ్చిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేయ‌గా.. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో షై హోప్ (121 బంతుల్లో 96 పరుగులు, 4 ఫోర్లు, 1 సిక్సర్), లూయీస్ (67 బంతుల్లో 70 పరుగులు, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), హిట్‌మైర్ (26 బంతుల్లో 50 పరుగులు, 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లు ఆక‌ట్టుకునే ప్ర‌దర్శ‌న చేశారు. ఇక బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్, రహమాన్‌ల‌కు చెరో 3 వికెట్లు ద‌క్క‌గా, షకిబ్ అల్ హసన్ కు 2 వికెట్లు ద‌క్కాయి.

అనంత‌రం 322 ప‌రుగుల భారీ లక్ష్యంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆరంభించ‌గా.. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో ఆల్‌రౌండ‌ర్ షకిబ్ అల్ హ‌స‌న్ 99 బంతుల్లోనే 16 ఫోర్లతో 124 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే మరో బ్యాట్స్‌మెన్ లైటన్ దాస్ కూడా కేవ‌లం 69 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో బంగ్లాదేశ్ సునాయాసంగా విజ‌యం సాధించింది. అయితే నిజానికి బంగ్లా బ్యాట్స్‌మెన్ ఆది నుంచి విండీస్ బౌలర్ల‌కు చుక్క‌లు చూపించారు. ఏ ద‌శలోనూ వారిని కోలుకోనివ్వ‌లేదు. ఈ క్ర‌మంలో బంగ్లా బ్యాట్స్‌మెన్ బౌండ‌రీ మీద బౌండరీలు బాదుతుంటే విండీస్ ఆట‌గాళ్లు చూస్తూ ఉండ‌డం తప్ప మ‌రేమీ చేయ‌లేక‌పోయారు. కాగా వెస్టిండీస్ బౌలర్లలో ఆండ్రూ రస్సెల్, ఒషానె థామస్‌లకు చెరొక వికెట్ దక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news