ఎట్ట‌కేల‌కు అమెరికా విమానం ఎక్కిన కోహ్లి.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడ‌తాడా..?

-

క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌రానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. భార‌త కాల‌మానం ప్ర‌కారం జూన్ 2 నుంచి ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనేందుకు రెండు బృందాలుగా భార‌త జ‌ట్టు ఇప్ప‌టికే అమెరికాకు చేరుకుంది. అయితే.. టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లి మాత్రం వెళ్ల‌లేదు. ఎట్ట‌కేల‌కు ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు కోహ్లి అమెరికా బ‌య‌లుదేరారు. గుర‌వారం రాత్రి ముంబై విమానాశ్ర‌యానికి చేరుకున్న అతడు అమెరికా ఫ్లైట్ ఎక్కాడు. ముంబై ఎయిర్‌పోర్టులో కోహ్లిని చూసిన అభిమానులు అత‌డితో ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే.. భార‌త జ‌ట్టు జూన్ 1 బంగ్లాదేశ్‌తో వార్మ‌ప్ మ్యాచ్ ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆడ‌తాడా లేదా అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడ‌నుంది. ఇక క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసే భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news