తెలంగానం : ఉచిత వైద్యం వాకిట పేద‌లెంద‌రో ?

-

విద్య‌నూ, వైద్యాన్నీ ఏ విధంగా విస్మ‌రించినా ఓ ప్ర‌భుత్వం విఫలం చెందిద‌నే భావించాలి. స‌రైన ఆస్ప‌త్రులు ఇప్ప‌టికీ చాలా చోట్ల లేవు. వైద్య రంగం కొత్త స‌వాళ్ల‌ను స్వీక‌రించేందుకు సిద్ధంగా ఉన్నా, అందుకు త‌గ్గ విధంగా మౌలిక వ‌స‌తులు లేని సంద‌ర్భాలెన్నో. పేదలంతా ప్ర‌భుత్వ ద‌వ‌ఖానాల‌కే వ‌స్తారు క‌నుక వారి కోసం చేయాల్సింది ఎంతో ! ఆ విధంగా చేయాల్సినంత చేయాలి. ఉచిత వైద్యం  అందించే క్ర‌మంలో  ఇప్ప‌టి క‌న్నా మెరుగైన సేవ‌లు ఏ ప్ర‌భుత్వం అయినా బాధ్య‌త‌గానే భావించాలి.

అటు ఆంధ్రా అయినా ఇటు తెలంగాణ అయినా ఇందుకు మిన‌హాయింపు కాదు. పోలిక ప‌రంగా తెలంగాణ బాగుంది..అనేందుకు అనేక కార‌ణాలు ఉన్నాయి. ఆర్థికంగా ఉన్నతం అయిన రాష్ట్రం క‌నుక బాగుంది. ఆ విధంగా చూస్తే ఆంధ్రా కు వెనుక‌బాటు త‌ప్ప‌దు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ వైద్య ఆరోగ్యానికి గ‌తం క‌న్నా ఇప్పుడు నిధుల కేటాయింపు బాగున్నా, ఇంకా చేయాల్సిన‌దెంతో !
“హైదరాబాద్ లో బస్తీ దవఖానాలు సూపర్ హిట్ అయ్యాయి. 15వ ఆర్థిక సంఘం బస్తీ దవఖానా పేదలకు మంచి వైద్య సేవలు అందిస్తోందని దేశమంతా నెలకొల్పాల‌ని ప్ర‌తిపాదించి, ఇక్క‌డి నిర్వ‌హ‌ణ‌ను కొనియాడింది. హైదరాబాద్ లో ప్రజల అవసరాలకు అనుగుణంగా 350 బస్తీ దవఖానాలు ప్రారంభించాం..” అని అంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు. ఆ విధంగా ఆయ‌న పేద‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు ఏ విధంగా అందిస్తున్నామో వివ‌రిస్తున్నారు. క‌నుక ఉచిత వైద్యం ఆవ‌శ్య‌క‌త ఇవాళ ఎంతో ఉంది. గ‌తం క‌న్నా మెరుగైన సేవ‌లు అందించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వాల‌పై ఉంది. ప్ర‌జారోగ్య ప‌రిర‌క్ష‌ణే ధ్యేయంగా ప‌నిచేస్తూ ఎంద‌రో పేద‌ల‌కు అండ‌గా ఉండాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంది. అందుకు త‌గ్గ విధంగా ప్ర‌భుత్వాస్ప‌త్రుల ప్రాంగణాలు మ‌రింత మారాలి. మ‌రింత స‌మ‌ర్థనీయ ధోర‌ణిలో ప‌నిచేయాలి. ఒక‌ప్పుడు క‌న్నా ఇప్పుడు బెట‌ర్. ఇంకా మారితే ఉమ్మడి రాష్ట్ర పాల‌కుల క‌న్నా తెలంగాణ పాల‌కులే మిక్కిలి శ్ర‌ద్ధ‌తో ప్ర‌జా రోగ్యం ప‌రిర‌క్ష‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉన్నార‌న్న మాట ఒక‌టి త‌ప్ప‌క నిర్థారితం అవుతుంది.

అభివృద్ధి మాత్ర‌మే మాట్లాడాలి అన్న నినాదంతోనే తెలంగాణ ఆవిర్భావ దినోత్స నిర్వ‌హ‌ణ‌కు స‌న్న‌ద్ధం అవుతున్నారు ఆ పార్టీ పెద్ద కేసీఆర్. ఆ విధంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం న‌మోదు చేసి, జాతీయ  రాజ‌కీయాల్లోనూ నెగ్గాల‌ని ఆశిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో పేద‌ల‌కు వైద్యం అందించ‌డంను ప్రామాణికంగా తీసుకుని, మెరుగైన వ‌స‌తుల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో కేసీఆర్ కు ఆర్థిక ప‌రంగా స‌వాళ్లు ఉన్నా కూడా వీలున్నంత మేర సంబంధిత ప‌నుల‌ను మాత్రం చేప‌ట్టేందుకే సుముఖ‌త వ్య‌క్తం చేస్తున్నారు. సర్కారు వైద్యంపై భ‌రోసా క‌ల్పించ‌డమే ధ్యేయంగా బ‌స్తీ ద‌వ‌ఖానాలు ప‌నిచేస్తున్నాయి అని, అదేవిధంగా గాంధీ, ఉస్మానియా సేవ‌ల్లో ఎంత‌గానో మెరుగుద‌ల పొందాయ‌ని సంబంధిత వ‌ర్గాలు ఇవాళ చెబుతున్న మాట.

సగటున రోజు 30-35 వేల ప్రజలకు ఉచిత వైద్యం, పరీక్షలు, మందులు ఇస్తున్నారు. ఇదే స్పూర్తితో పల్లె దవాఖానాలు ప్రారంభించాలని సూచించారు. కేసీఆర్ కిట్. మరో అద్భుతమైన పథకం… అని అంటున్నారు హ‌రీశ్ రావు. అవును !  రోజుకు 30 వేల మంది అంటే నెల‌కు ఎలా చూసుకున్నా 9 ల‌క్ష‌ల మంది. రోజుకు 35వేలు మంది అంటే నెల‌కు 10 ల‌క్ష‌ల‌కు పైగానే ప్ర‌జ‌లు వైద్య సేవ‌లు అందుకుంటున్నారు. అందుకే భాగ్య నగ‌రి వాకిట స‌ర్కారీ వైద్యానికి మ‌రింత డిమాండ్ పెరుగుతోంది. ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా కొత్త ఆస్ప‌త్రుల నిర్మాణానికి కేసీఆర్ స‌న్న‌ద్ధం అవుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే నిన్న‌టి వేళ న‌గ‌రంలో మూడు చోట్ల మూడు మ‌ల్టీ స్పెషాల్టీ ఆస్ప‌త్రుల‌కు శ్రీకారం దిద్దారు. టిమ్స్ పేరిట త్వ‌ర‌లోనే ఇవి నిర్మాణం జ‌రుపుకోనున్నాయి. ఇవి పూర్త‌యితే భాగ్య‌న‌గ‌రి వాసుల‌కు వ‌ర‌మే !

Read more RELATED
Recommended to you

Latest news