జగన్ బెయిలు రద్దుకు సరైన కారణాల్లేవు : తెలంగాణ హైకోర్టు

-

అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ప్రధాన నిందితుడైన ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బెయిలును రద్దు చేయడానికి సరైన కారణాలు లేవంటూ తెలంగాణ హైకోర్టు పేర్కొంది. షరతులను ఉల్లంఘించిన సంఘటన ఒక్కటీ పేర్కొనలేదని, అందువల్ల బెయిలును రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది.

ముఖ్యమంత్రిగా జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, సాక్షులను ప్రభావితం చేస్తున్నందున బెయిలు రద్దు చేయాలన్న అభ్యర్థనను సీబీఐ కోర్టు కొట్టివేయడంతో ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ శుక్రవారం తన తీర్పు వెలువరించారు.

‘జగన్‌ ద్వారా బెదిరింపులు, ప్రలోభాలకు గురైన సాక్షుల వివరాలను వెల్లడించలేదు. అధికార దుర్వినియోగానికి పాల్పడి సహ నిందితులకు కీలక పదవులను కట్టబెట్టడం ద్వారా సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేస్తారు అన్నవి సరైన కారణాలు కావు. బెయిలు రద్దు కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు 2021 సెప్టెంబరు 15న కొట్టివేసింది. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేవని సీబీఐ పేర్కొంది. అన్ని అంశాలను పరిశీలించిన మీదట బెయిలు రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌లో జోక్యానికి ఎలాంటి కారణాలు లేవు..’ అని తీర్పు వెలువరించారు.

Read more RELATED
Recommended to you

Latest news