మానుకోట ఘటనకు 14 ఏళ్లు.. హరీశ్ రావు ఆసక్తికర ట్వీట్..!

-

మానుకోట ఘటనకు 14 ఏళ్లు పూర్తయిన వేళ మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ.. మానుకోట ఘటన ఓ చారిత్రాత్మక సందర్భం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఆ సంఘటన జరిగి నేటికి 14ఏళ్లు అని హరీష్ రావు అన్నారు. ఆధిపత్య అహంకారంతో తుపాకులు ఎక్కుపెట్టిన అప్పటి పాలకులకు మానుకోట రాళ్లే సమాధానం చెప్పాయి. తుపాకీ తూటాలకు దీటుగా తిరగబడ్డాయి.

ఈ పోలీసుల బుల్లెట్లకు ప్రతిస్పందిస్తూ ఉద్యమ కారులు చూపిన తెగువకు సమైక్య పాలకులు వెనుదిరుగక తప్పలేదు. తెలంగాణ ఉద్యమ ఉనికినే ప్రశ్నార్ధకంగా మార్చే ప్రయత్నాన్ని మానుకోట మట్టి సాక్షిగా ఉద్యమకారులు ఏకమై తిప్పి కొట్టారు. స్వరాష్ట్ర ఆకాంక్షను మరోసారి బలంగా చాటిచెప్పారు. ఈ క్రమంలో తుపాకీ తూటాలకు వెరవలేదు, లాఠీలకు భయపడలేదు. స్వరాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ముందుకు కదిలి ఉద్యమానికి ఊపిరిలూదారు. ఆ చారిత్రక సన్నివేశాలు ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. చరిత్రపుటల్లోనూ అవి చిరస్థాయిగా నిలిచిపోతాయి. భవిష్యత్ తరాలకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటుతాయి అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news