నేటి కాలంలో ప్రతి ఒక్కరికి సెల్ ఫోనే ప్రపంచంగా మారింది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు కూడా ఫోన్లకు అతుక్కుపోతున్నారు. సెల్ ఫోన్ లేనిదే జీవితం లేదన్నట్లుగా తయారవుతున్నారు. తాజాగా సెల్ ఫోన్ కొనివ్వలేదని కోపంతో క్షణికావేశానికిలోనైన ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేటలో చోటుచేసుకుంది.
తిప్పన్నపేటకు చెందిన మాడ్య రామ్ చరణ్ అనే తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలుడు మంగళవారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్యకి పాల్పడ్డాడు. తనకి ఫోన్ కావాలని తల్లిని అడగగా.. చదువు పాడవుతుందని ఆమె నిరాకరించింది. దీంతో బాలుడు ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన జగిత్యాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికీ బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.