కెసిఆర్ కు నిజాం ఆత్మ ఆవహించినట్టు ఉందని అన్నారు మాజీ ఎంపీ, బిజెపి నేత బూర నర్సయ్య గౌడ్. అందుకే సెక్రటేరియట్ ను ప్యాలెస్ లాగా కడుతున్నాడని ఎద్దేవా చేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కెసిఆర్ వ్యవహార శైలి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిందని అన్నారు.
కెసిఆర్ కు అంతా నేనే అనే మానసిక వ్యాధి ఉన్నట్టు ఉందన్నారు. నార్త్ కొరియా లాగా రాష్ట్రంలో కూడా కుటుంబ పాలన కొనసాగించాలని కేసీఆర్ అనుకుంటున్నాడని విమర్శించారు. రానున్న బడ్జెట్ ను అయినా వాస్తవాలకు అనుగుణంగా రూపొందించాలని, భూ నిర్వాసితులకు వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.