కరీంనగర్లో శుక్రవారం రోజున ఓ హోటల్ యజమాని బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఆరోజే హోటల్ ప్రారంభోత్సవం జరగడంతో.. ప్రచారం కోసం సూపర్ స్టంట్ చేశాడు. రూపాయి నోటుకే చికెన్ బిర్యానీ ఇస్తామంటూ ప్రచారం చేయడంతో జనం ఎగబడ్డారు. ఈ ప్రచారంతో 10 నిమిషాల వ్యవధిలో సుమారు 800 వరకూ పొట్లాలు విక్రయించాడు ఆ హోటల్ యజమాని. తయారు చేసిన బిర్యానీ అంతా పది నిమిషాల్లోనే అయిపోవడం, వచ్చిన జనం తమకూ ఇవ్వాల్సిందేనని గొడవకు దిగారు. దీంతో ఏం చేయాలో అర్థం గాక.. హోటల్ నిర్వాహకులు తలపట్టుకున్నారు.
ఈ గొడవతో పాటు అక్కడ జనం గుమిగూడటంతో రద్దీ అంతకంతకూ పెరిగిపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తేవరకూ వెళ్లడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిర్వాహకుడిని మందలించి, జనాలకు సర్దిచెప్పి పంపించారు. ఇదిలా ఉంటే..రూపాయి బిర్యానీ కోసం వచ్చి అక్కడ వాహనాలు నిలిపిన కొందరికి ట్రాఫిక్ పోలీసులు రాంగ్ పార్కింగ్ కింద రూ.100 జరిమానా విధించడం కొసమెరుపు.