డిస్క‌ష‌న్ పాయింట్ : పాత విభేదాలే అవి.. జియ‌రు కొత్త‌గా చెప్పిందేం లేదు ?

-

రెండంటే రెండు ఆచారాలు రెండంటే రెండు మార్గాలు.. భ‌క్తి మార్గాలు అని రాయాలి. శివ త‌త్వం వైపు కొంద‌రు,విష్ణు త‌త్వం వైపు కొంద‌రు.. దేవుడిలో మ‌నిషి ఉన్నాడు మ‌నిషే ఓ గొప్ప దేవుడికి ప్ర‌తిరూపం అని చెప్పేది ఇంకొంద‌రు. రెండు ద్వైతం.. రెండు కాని ఒక్క‌టి అద్వైతం.అంటే శివుడూ, విష్ణువూ ఇద్ద‌రు కాదు ఒక్క‌రే అని చెప్ప‌డం.. వీటికి అతీతంగా మ‌నిషిలో ఉన్న దైవ గుణాన్ని వెలికి తీయ‌డం.. దైవ‌త్వాన్నీ, మాన‌వ‌త్వాన్నీ ఒక్క‌టిగా చూప‌డం అన్న‌వి విశిష్టాద్వైత భావ‌న‌లు.

వీటినే జ‌గ‌ద్గురు రామానుజా చార్యులు ప్ర‌చారం చేశారు. మ‌నిషిలో ఉన్న దేవుడ్ని వెతికే సంప్ర‌దాయం ఒక‌టి అత్యున్న‌తం. ఈ ప్ర‌క్రియ‌కే ప్రాధాన్యం ఇస్తూ స‌మాన‌త్వ చింత‌న ఒక‌టి నెల‌కొల్పే ప్ర‌య‌త్నం చేశారు రామానుజులు. ఇవేవీ ప‌ట్టించుకోకుండా కొంద‌రు ఒక్కో వాదం ఒక్కో తత్వం వినిపిస్తూ హైంద‌వంలో కొన్ని వ‌ర్గ విభేదాలు తేవ‌డ‌మే ఇప్ప‌టి వివాదానికి ఓ కార‌ణం.

జీవుడిలో దేవుడ్ని వెతికే సంప్ర‌దాయం విశిష్టాద్వైతం అని చెబుతారు వైదికులు. ఇక్క‌డ అడ‌విలో వ‌నాల్లో ప్ర‌కృతి ఆరాధ‌న‌లో దేవుడ్నివెత‌క‌డం ఇది కూడా ఓ భ‌క్తి మార్గ‌మే. అడ‌వి బాట‌లో న‌డ‌యాడిన సాహ‌స స్త్రీ మూర్తులు ఇక్క‌డ దేవ‌త‌లు.. వారే స‌మ‌క్క సార‌ల‌మ్మ‌లు.. వారి ఆరాధ‌న అన్న‌ది శైవ సంబంధం అనుకోండి..లేదా ప్ర‌కృతి సంబంధం అనుకోండి.. అలాంటి ఆరాధ‌న కార‌ణంగానే ఇన్నేళ్లూ భ‌క్తులు తాము ఆనందం పొందుతూ ప‌దుగురికీ ఆనందం పంచుతున్నారు. ఇలాంటి ఆరాధ‌న విశిష్టాద్వైతంలోనూ ఉంది. జీవుడిలో దేవుడిని వెతికే ఆరాధ‌న. మార్గాలు వేర‌యినా భ‌గ‌వంతుడిని చేరుకునేందుకు దారులు వేర‌యినా గ‌మ్యం ఒక్క‌టే కానీ.. ఇక్కడే శైవం అని ఒక‌రు,వైష్ణ‌వం అని మ‌రొక‌రు క‌య్యానికి కాలు దువ్వుతున్నారు.

శైవ,వైష్ణవ సంప్ర‌దాయాల మ‌ధ్య ఏనాటి నుంచో ఒక విభేదం న‌డుస్తూ ఉంది.అందుకు త‌గ్గ కార‌ణాలు ఏమ‌యినా రెండు వేర్వేరు భ‌క్తి మార్గాల‌లో ప్ర‌జ‌లు కూడా త‌మ త‌మ ఆచ‌ర‌ణ‌కు ప్రాధాన్యంఇచ్చారు. కొంద‌రు రెంటికీ ప్రాధాన్యం ఇస్తూ భ‌గ‌వంతుడు ఒక్క‌డే స్వామిని ఆరాధించే విధానాలే వేర్వేరు అన్న మాట కూడావినిపిస్తూ ఆచ‌రిస్తూ ఆద‌ర్శం అవుతున్నారు. కొంద‌రు మాత్రం ఇప్ప‌టికీ ఈ త‌గాదాలోనే ఉంటున్నారు అన్న‌ది ఓ వాస్త‌వం.జియ‌ర్ స్వామి వివాదం కూడా ఇలాంటిదే! ఆయ‌న గ‌తంలో చేసిన వ్యాఖ్య‌లు త‌వ్వి విడుద‌ల చేసింది ఎవ్వ‌ర‌యినా స‌రే ఆ మాటల్లో అంత‌రార్థం వేరుగా ఉంద‌ని, శైవ సంబంధ ఆరాధ‌కులకు ఇవి కోపం తెప్పించే విధంగానే ఉన్నాయ‌ని,అడ‌వి దేవ‌త‌ల‌పై ఆయ‌న‌కు ఉన్న చిన్న‌చూపే కార‌ణం అని అవే ఆ మాట‌లు అనిపించి ఉంటాయ‌ని కొంద‌రు అంటున్నారు.

వివాదం తీరు ఎలా ఉన్నా కూడా తెలంగాణ వ్యాప్తంగానే కాదు ఇరు తెలుగు రాష్ట్రాల‌కు అదేవిధంగా ప‌క్క‌నే ఉన్న రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు కూడా స‌మ‌క్క సార‌క్క‌ల జాత‌ర ఓ పెద్ద పండుగ. కోట్ల మందికి ఆమె సిరులిచ్చే క‌ల్ప‌వ‌ల్లి. వ‌రాలిచ్చే త‌ల్లి.ఆ విధంగా విశ్వాసాల‌కు ఆమె ప్ర‌తీక.ఎంద‌రో జీవితాల‌ను ఎన్నో ఏళ్లుగా ప్ర‌భావితం చేస్తున్న విశ్వాసాల‌ను కించ‌ప‌రిచి మాట్లాడ‌డంతోనే స్వామిజీ వివాదాల్లో ఇరుక్కున్నారు.ఇప్ప‌టికే స్వామీజీ చెప్పిన మాట‌లు వైర‌ల్ అయిపోయాయి.వీటిపై ఆయ‌న వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వ‌డం లేదు. పైగా పరంప‌ర‌లోనే స్వాములు స్పందిస్తున్నార‌ని జియ‌రు మాత్రం స్పందించ‌డంలో కినుక వ‌హిస్తున్నార‌ని వైదికులు అంటున్నారు.అంటే ప‌రంప‌ర‌లో లేని స్వాములు అంటే పరిపూర్ణానంద లాంటి వారు స్పందిస్తున్నార‌ని కానీ జియ‌ర్ స్వామి కానీ సంబంధీకులు కానీ మాట్లాడ‌డం లేద‌న్న‌ది ఓ వ‌ర్గం వాద‌న.ఈ ద‌శ‌లో వెయ్యి కోట్లు వెచ్చించి స‌మ‌తా మూర్తిని ప్ర‌తిష్టించిన జియ‌రు స్వామీజీ పాటించాల్సిన స‌మాన‌త్వ భావ‌న ఇదేనా అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news