బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దంటూ తమ పార్టీ కార్యకర్తలను భయపెట్టే వారిని విడిచిపెట్టేది లేదని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసింది. ఎవరెవరు బెదిరిస్తున్నారో వారి పేర్లను బరబార్ పింక్ బుక్లో నోట్ చేస్తామని చెప్పారు.
కేసీఆర్ మంచోడు కావచ్చు.. కానీ నేను కొంచెం రౌడీ టైప్..ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బెదిరింపులకు పాల్పడేవారిని, కేసులు పెట్టింది పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఎవరైనా ఊరుకునేది లేదు. వాళ్ల తాతలు, ముత్తాలు, జేజమ్మలు ఎవరు దిగొచ్చినా కూడా భయపడేవాళ్లు ఎవరూ లేరు ఇక్కడ.. అన్నారు కవిత. మరోవైపు మాట తప్పడం, మడమ తిప్పడమే కాంగ్రెస్ ప్రభుత్వం నైజం అని గ్యారెంటీల అమలులో ప్రభుత్వం విఫలం చెందిందని దుయ్యబట్టారు.