రేవంత్‌ తెలంగాణవాది కాదు.. తెలంగాణకు వ్యాధి : మంత్రి కేటీఆర్

-

తెలంగాణ వాదాన్ని లేకుండా చేస్తామని భీషణ ప్రతిజ్ఞలు చేసినవారు ఇప్పుడు తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తున్నామంటూ దొంగ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేవీపీ రాంచందర్‌రావు కూడా తెలంగాణవాదినంటే చావాలా? బతకాలా? అన్నారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటే పారిపోయిన కిషన్‌రెడ్డి, తెలంగాణ వాదులపై రైఫిల్‌ ఎక్కుపెట్టిన రేవంత్‌రెడ్డి, తెలంగాణకు బద్ధ వ్యతిరేకిగా పార్లమెంట్‌లో ప్లకార్డు పట్టుకున్న కేవీపీ, తెలంగాణ వాదాన్ని అవహేళన చేసిన షర్మిల లాంటివాళ్లు తెలంగాణ వాదులా? అని మండిపడ్డారు. వాళ్లంతా తెలంగాణ వాదులై రాష్ట్రాన్ని తెస్తే తాము ప్రేక్షకపాత్ర వహించామా? అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి తెలంగాణ వాది కాదు.. తెలంగాణకు పట్టిన ఓ వ్యాధి అని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్​లో ఎవరైనా ఉండొచ్చని.. కానీ తెలంగాణను మేమే తెచ్చాం.. మేమే ఇచ్చామంటూ కొందరు మాట్లాడుతుంటే బాధేస్తుందన్నారు. అసలు టీ కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి హారతులు పట్టినవాళ్లు, వైఎస్‌ఆర్‌, కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వాల్లో ఉండి ఉద్యమానికి వ్యతిరేకంగా మంథని, మంచిర్యాలలో మీటింగ్‌లు పెట్టినవాళ్లంతా తెలంగాణ వాదులేనా అని నిలదీశారు. ఇవాళ కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీకి తెలంగాణలో డైరెక్షన్‌ ఇస్తారని.. తెలంగాణను వ్యతిరేకించిన కేవీపీ తాను తెలంగాణ వాడినని, కనీసం 50 శాతం తెలంగాణ అని ఒప్పుకోమంటారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news