TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం.. సమగ్ర దర్యాప్తు చేయాలని డీజీపీకి కేటీఆర్ ఆదేశం

-

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని డీజీపీని కోరారు. నిందితుడు రాజశేఖర్‌రెడ్డి బీజేపీ కార్యకర్త అంటూ టీఎస్‌టీఎస్‌ ఛైర్మన్‌ పి.జగన్‌ ట్వీట్‌ చేశారు. బీజేపీ కండువాతో ఉన్న రాజశేఖర్‌ ఫొటోను పోస్టు చేశారు. దీనిపై కేటీఆర్‌ స్పందించారు. ప్రభుత్వానికి నష్టం కలిగించేలా, అమాయక యువత జీవితాలు నాశనం చేసేలా బీజేపీ కుట్ర పన్నినట్లు కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. వీలైనంత త్వరగా ఈ కుట్ర వెనుక ఉన్నవారిని పట్టుకోవాలని డీజీపీని ఆదేశించారు.

మరోవైపు టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కుట్రదారు బీజేపీ కార్యకర్తే అని.. ఈ వ్యవహారంలో దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్లు బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, బొంతు రామ్మోహన్‌, దాసోజు శ్రావణ్‌ అన్నారు. బీజేపీ కార్యకర్తలంటేనే ‘లీకు’వీరులని.. గుజరాత్‌లో 13 ప్రశ్నపత్రాలు లీకయ్యాయని, యూపీలో అనేకసార్లు లీక్‌ చేశారని ఆరోపించారు. ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై చింతిస్తున్నామని.. నిరుద్యోగ యువతకు, ఉద్యోగార్థులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news