నేడు వరంగల్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన!

-

భారత్ రాష్ట్ర సమితి పార్టీ వరంగల్ లోక్ సభ అభ్యర్థిని ఇవాళ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. స్థానిక నేతలు, పార్టీ సీనియర్ నేతలతో అధినేత కేసీఆర్ ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.  కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకోవాలని వరంగల్ పరిధిలోని ఆశావహులు తీర్మానించారు. స్థానిక మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాలని పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది.

హన్మకొండ జడ్పీ ఛైర్మన్ సుధీర్ కుమార్, వైద్యుడు సుగుణాకర్ రాజు, మాజీ ఎమ్మెల్యే రాజయ్య, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్న, జడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, నేతల అభిప్రాయాలకు అనుగుణంగా అభ్యర్థి పేరును కేసీఆర్ ఖరారు చేయనున్నారు. రేపు చేవెళ్ల నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. దీంతో ఇవాళ వరంగల్ అభ్యర్థిని ప్రకటించ వచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వరంగల్ లోక్సభకు మొదట కడియం కావ్యను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె పార్టీ మారడంతో ఇప్పుడు మరో అభ్యర్థి ప్రకటనపై బీఆర్ఎస్ దృష్టి సారించింది.

Read more RELATED
Recommended to you

Latest news