శాసనసభలో TRS పేరు BRSగా మార్పు

-

టీఆర్‌ఎస్‌ భారత్ రాష్ట్ర సమితిగా పరివర్తనం నేపథ్యంలో శాసనసభ, మండలిలోనూ పార్టీ పక్షం పేర్లు అధికారికంగా మారాయి. ఇక నుంచి భారత్ రాష్ట్ర సమితి శాసనసభాపక్షంగా వ్యవహరించనున్నారు. పార్టీ పేరు మారిన తరుణంలో శాసనసభ, మండలి రికార్డుల్లోనూ పేరు మార్చాలని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేత కౌన్సిల్ ఛైర్మన్, శాసనసభాపతికి లేఖ రాశారు. పార్టీ పేరు మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం రాసిన లేఖను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

ఆ విజ్ఞప్తికి అనుగుణంగా టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం పేరును బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షంగా మారుస్తూ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా రికార్డుల్లో మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. పేరు మార్పునకు సంబంధించి శాసనసభ కార్యదర్శి బులెటిన్ జారీ చేశారు. దాదాపు 9ఏళ్లుగా తెలంగాణను ఏలుతోన్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ఇటీవల జాతీయ రాజకీయాలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగానే దసరా పండుగ వేళ కేసీఆర్‌ భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news