గ్రేటర్‌లో గెలిచిన కార్పొరేటర్ల పై ఆఫర్ల వల !

-

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆపరేషన్‌ ఆకర్ష్‌కు మళ్లీ తెరలేచిందా ప్రత్యర్థి పార్టీల కార్పొరేటర్లకు వల విసిరే పనులు తెర వెనక ముమ్మరంగా సాగుతున్నాయా అంటే అవుననే సమాధనమే వినిపిస్తుంది. కార్పొరేటర్లకు ఆయా పార్టీలు ఇస్తున్న ఆఫర్ల పై బీజేపీ, టీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య ఆసక్తికర చర్చ నడుస్తుంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో గెలుపుకోసం ఎంత ఖర్చు పెట్టారు? మా వైపు రండి.. అయిన ఖర్చుకు డబులు ఇస్తాం! భవిష్యత్‌లో కోట్ల విలువైన పనులు అప్పగిస్తాం! .. ఇదీ.. గ్రేటర్ లో గెలిచిన కార్పొరేటర్లకు పార్టీలు ఇస్తున్న ఆఫర్‌. తెరవెనక ఈ అంశాలపై జోరుగానే లాబీయింగ్ నడుస్తోందట. గ్రేటర్ ఎన్నికల్లో మేయర్‌ పీఠం అధిష్టించేందుకు అవసరమైన సంఖ్యాబలం ఏ పార్టీకి దక్కలేదు. టీఆర్‌ఎస్‌ 56 దగ్గరే ఆగిపోయింది. బీజేపీ బలం 48కి చేరుకుంది. MIM 44 డివిజన్లు సొంతం చేసుకుంది. రెండుచోట్ల కాంగ్రెస్‌ గెలిచింది. ఎక్స్‌ అఫీషియో సభ్యులను కలుపుకొన్నా మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరువకాని పరిస్థితి.

మూడు పార్టీలలో ఏవైనా రెండు కలిస్తేనే ప్రతిష్టంభన తొలుగుతుంది. కానీ.. అలాంటి పరిణామాలకు ఆస్కారం లేదని అభిప్రాయ పడుతున్నాయి రాజకీయ వర్గాలు. మధ్యేమార్గంగా స్పెషల్‌ ఆఫీసర్‌ పాలన పెడతారని లీకులు బయటకు వస్తున్నాయి. దే సమయంలో టీఆర్‌ఎస్‌, బీజేపీలు తెరవెనక పెద్ద మంత్రాంగమే నడుపుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిప్పు లేనిదే పొగ రాదన్నట్టుగా ప్రచారం మొదలైంది. మొన్నటి ఎన్నికల్లో అనుచరులకు టికెట్లు ఇప్పించుకోలేకపోయిన ఒకరిద్దరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.. వారిని బీజేపీ నుంచి బరిలో దించారని కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. గెలిచిన తర్వాత తిరిగి సొంత గూటికి తీసుకు రావొచ్చనే ప్లాన్‌తో పంపారట.

గ్రేటర్ ఎన్నికల్లో అలాంటి వారు కొందరు కార్పొరేటర్లుగా గెలిచినట్టు చెబుతున్నారు. ఇప్పుడు వారు బీజేపీ కండువా తీసేసి కారెక్కుతారనే ప్రచారం ఓ రేంజ్‌లో సాగుతోంది. వెనక్కి వచ్చే కార్పొరేటర్లకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారట ఆ ఎమ్మెల్యేలు. ఎన్నికల్లో గెలవడానికి అయిన ఖర్చుకు రెట్టింపు ఇస్తామని.. భవిష్యత్‌లో కోట్ల రూపాయల పనులు అప్పగిస్తామని చెబుతున్నట్టు సమాచారం. అయితే ఎన్నికల ముందు వరకు, గెలిచిన తర్వాత వెళ్లిపోదామని భావించిన సదరు కార్పొరేటర్లు.. ఇప్పుడు పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఎమ్మెల్యేలు ఎంత చెప్పినా ఊ కొట్టడం లేదట. రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని డైలమాలో పడ్డారట.

అధికార పార్టీ ప్రయత్నాలకు ప్రస్తుతం ఇక్కడ పీటముడి పడినట్టు భావిస్తున్నారు. మరి..ఈ ఆఫర్‌ కేవలం ఎమ్మెల్యే అనుచరులకే పరిమితమైందా లేక మరికొందరికి కూడా ఈ తరహా ప్రతిపాదనలు పెట్టారా అన్న చర్చ ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ నాయకులు కూడా టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లకు ఆకర్షణ వల విసురుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు కార్పొరేటర్లతో కమలనాథులు టచ్‌లోకి వెళ్లినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. తెరవెనక జరుగుతున్న ఈ తరహా ప్రయత్నాలను టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు కొట్టిపారేస్తున్నా.. జరుగుతున్న పరిణామాలను తేలికగా తీసుకోవడానికి లేదట.

మరి ఈ విషయంలో గులాబీ వ్యూహం ఫలిస్తుందో.. కమలం ఎత్తుగడ రాణిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news