విద్యార్థులతో వెళుతున్న స్కూల్ బస్సు డ్రైవరుకు అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టాడు. పక్కనే ఉన్న విద్యార్థిని ఇదంతా గమనించింది. అందరి ప్రాణాలు కాపాడని సమయస్ఫూర్తితో ధైర్యంగా స్టీరింగ్ తిప్పింది. అందరినీ ప్రమాదం నుంచి కాపాడింది. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
నగరంలోని భరద్ పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులతో వెళ్తూ.. గొండాల్ రోడ్డు వద్దకు రాగానే డ్రైవరు గుండెపోటుతో మెలికలు తిరిగిపోయాడు. అదుపుతప్పి డివైడర్ దాటిన బస్సు ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొంటూ పోయింది. దీనిని గమనించిన భార్గవి వ్యాస్ అనే బాలిక వెంటనే స్టీరింగు పట్టుకొని బస్సును నియంత్రించడంతో పెనుప్రమాదం తప్పింది.
‘‘నేను డ్రైవరు పక్కనే ఉన్న సీట్లో కూర్చున్నా. బస్సు గొండాల్ రోడ్డు వద్దకు చేరుకోగానే.. డ్రైవర్ మాటలు తడబడ్డాయి. అతడి నోరు ఒకవైపునకు వచ్చేసి.. ముక్కు నుంచి రక్తం కారింది. స్టీరింగు వదిలేసి ఒక పక్కకు పడిపోయాడు. నేను వెంటనే స్టీరింగు తిప్పి బస్సును కరెంటు స్తంభానికి ఢీకొట్టి ఆపాను’ అని భార్గవి వివరించింది. డ్రైవర్ హారున్భాయ్ రాజ్కోట్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.