చైనాలో కంటే ఇండియాలో 29 లక్షల మంది జనం ఎక్కువ – విజయసాయిరెడ్డి

-

చైనాలో కంటే ఇండియాలో 29 లక్షల మంది జనం ఎక్కువ అని తెలిపారు విజయ సాయిరెడ్డి. ఇండియాలో అభివృద్ధి అనుకున్న స్థాయిలో లేకపోవడానికి, పేదరికానికి ప్రధాన కారణం అదుపు లేకుండా పెరుగుతున్న జనాభాయేనని 1960లు, 70లు, 80ల్లో ప్రపంచ ప్రగతి నిపుణులు, కొందరు అంతర్జాతీయ ఆర్థికవేత్తలు చెప్పేవారు. 1990ల నుంచీ భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు ప్రాధాన్యం పెరిగింది. టెక్నాలజీ, సంబంధిత నైపుణ్యాలు పెంచుకోవడంపై ప్రభుత్వాలు, రాజకీయపక్షాలు దృష్టి కేంద్రీకరించాయని తెలిపారు.

అయినా, ఇండియాలో జనాభా పెరుగుదల గతంలో మాదిరి వేగంగా లేకున్నా చైనా జనసంఖ్యను ఈ ఏడాది దాటిపోయే పరిస్థితి వచ్చింది. కిందటి దేశ జనగణన జరిగిన 2011 నుంచి ఇండియాలో జనాభా వృద్ధి రేటు 1.2 శాతం ఉందని, అంతకు ముందు పదేళ్లలో ఇది 1.7% ఉండేదని బుధవారం ఐక్యరాజ్యసమితి (ఐరాస) విడుదల చేసిన ప్రపంచ జనాభా గణాంకాలు చెబుతున్నాయి. చైనా జనాభాను భారత జనాభా ఈ నెలలోనే మించిపోతుందని ఐరాస పాత సంఖ్యా వివరాల ఆధారంగా అంతర్జాతీయ జనాభా నిపుణులు అంచనావేశారన్నారు.

అయితే, ఈ రెండు ఆసియా దేశాల నుంచి వాటి జనసంఖ్య వృద్ధికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు అందుబాటులోకి రావకపోవడం వల్ల ఏ నెలలో చైనాను భారత్‌ దాటిపోతుందో చెప్పడం కష్టమని ఐరాస తెలిపింది. రెండు దేశాల్లో జనసంఖ్య పెరుగుదల నెమ్మదించినప్పటికీ, ఇండియాతో పోల్చితే చైనాలోనే జనాభా వృద్ధి రేటు ఎక్కువ తగ్గుతోంది. అరవై ఏళ్లలో మొదటిసారి చైనాలో కిందటేడాది దేశ జనాభా తగ్గింది. ఈ చారిత్రక మార్పు ఫలితంగా అతిపెద్ద అర్థికవ్యవస్థల్లో ముందు వరుసలో ఉన్న చైనాలో తీవ్ర వ్యతిరేక పర్యవసానాలకు దారితీయవచ్చని అంచనా వేస్తున్నారు. చైనాలో గత ఏడాది మొదలైన జనాభా తగ్గుదల దీర్ఘకాలం పాటు కొనసాగుతుందని, దాని ప్రభావం దాని ఆర్థికవ్యవస్థపైనా, ప్రపంచంపైనా ఉంటుందని కూడా జనాభా నిపుణులు అంటున్నారు. చైనా, ఇండియా జనాభా మొత్తం జనాభా కలిపితే ప్రపంచ ప్రస్తుత జనాభా (800కోట్లు)లో మూడో వంతు అవుతుంది. శరవేగంతో ఆర్థికవ్యవస్థలు ముందుకు దూసుకెళ్లున్న ఈ రెండు ఆసియా దిగ్గజాల భూభాగాల్లోనే ప్రపంచంలోని మూడో వంతు మానవులు నివసించడం నిజంగా విశేషం అన్నారు సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news