సీఎం సొంత జిల్లాలో వైసీపీని టెన్షన్ పెడుతున్న రెబల్స్

-

సీఎం సొంత జిల్లా క‌డ‌పలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో వైసీపీకి రెబ‌ల్స్ బెడ‌ద త‌ప్పేట్లు లేదు. బ‌ద్వేలు మున్సిపాలిటీలో అధికార పార్టీ నుంచే ఎక్కువ మంది నామినేష‌న్లు వేశారు. బీ-ఫామ్‌ ఇవ్వకపోయినా… స్వతంత్రులుగా అభ్యర్ధులు బరిలో ఉండటంతో స్థానిక వైసీపీ నేతలకు రెబల్స్ టెన్షన్‌ పట్టుకుంది.

క‌డ‌ప జిల్లా బ‌ద్వేలు మున్సిపాలిటీకి ముచ్చట‌గా మూడోసారి ఎన్నిక‌లు జ‌ర‌గుతున్నాయి. ఇక్కడ 35 వార్డులు ఉండగా 90 మంది వైసీపీ తరఫున నామినేషన్లు వేశారు. ఆ తర్వాత 35 మంది వైసీపీ అభ్యర్థుల జాబితాను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి విడుదల చేశారు. మిగిలిన వారు బ‌రిలో నుంచి త‌ప్పుకోవాల్సి ఉన్నా… పార్టీ నిర్ణయం న‌చ్చని చాలా మంది రెబ‌ల్స్‌గా బ‌రిలో ఉండాల‌ని భావిస్తున్నారు. క్లిష్టపరిస్థితుల్లో పార్టీకి సేవ చేసినా… తమను గుర్తించడం లేదని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి రెబల్స్‌ను బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. పార్టీ నిర్ణయాన్ని కాద‌ని ఎవ‌రైనా పోటీలో ఉంటే వారిపై క్రమ‌శిక్షణా చ‌ర్యలు తీసుకుంటామ‌ని హెచ్చరించినా కొందరు ధిక్కరణ ధోరణిలోనే ఉన్నారు. బద్వేలు మున్సిపాలిటీలో పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందని భావించిన వైసీపీ చైర్మన్‌గా బడా కాంట్రాక్టర్‌ అయిన రాజగోపాల్‌రెడ్డిని గత ఏడాదే ఖరారు చేసింది. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడిన వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి చైర్మన్ పదవి ఎలా కట్టబెడతారంటూ అప్పట్లో స్థానిక నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు.

ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తీసుకున్న నిర్ణయంతో పార్టీ అధిష్టానం కూడా ఏకీభవించింది. కానీ ప్రస్తుతం గోవిందరెడ్డి రెబల్స్‌ను కట్టడి చేయడంతో పూర్తిగా విఫలమవుతున్నట్లు వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు వైసీపీలో అసంతృప్తిని గమనించిన టీడీపీ చైర్మన్‌ అభ్యర్థిని ఖరారు చేయకుండా కౌన్సిలర్‌ అభ్యర్థులతో ముమ్మరంగా ప్రచారం చేయిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news