ఎర్ర గంగిరెడ్డి డిఫాల్ట్‌ బెయిల్‌ రద్దు చేయొచ్చు.. వివేకా హత్య కేసులో సుప్రీం వ్యాఖ్యలు

-

మాజీ ఎంపీ వైఎస్‌ వివేకా హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో మొదటి నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి డిఫాల్ట్ట్‌గా వచ్చిన బెయిల్‌ను రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో దర్యాప్తు చేసిన ఏపీ పోలీసులు గంగిరెడ్డికి డిఫాల్ట్‌ బెయిల్‌ రావడానికే ఛార్జ్‌షీట్‌ దాఖలులో జాప్యం చేశారని అనుకోవడానికి ఆస్కారం ఉందని అభిప్రాయపడింది.

గంగిరెడ్డికి రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి ఏదైనా సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఎర్ర గంగిరెడ్డికి కడప కోర్టు ఇచ్చిన డిఫాల్ట్‌ బెయిల్‌ ఉత్తర్వులను ఏపీ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ ముగించింది. వివేకా హత్య కేసును తెలంగాణకు బదిలీ చేసినందున.. ఇప్పుడు గంగిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై మళ్లీ విచారణ జరపాలనుకుంటే తెలంగాణ హైకోర్టును ఆదేశించాలా? లేక ఏపీ హైకోర్టునే ఆదేశించాలా? అని న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఆర్‌.షా ప్రశ్నించారు. గంగిరెడ్డి బెయిల్‌ పొందేనాటికి కీలక విషయాలేవి బయటకు రాలేదు కదా అని ప్రశ్నించారు.

ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వల్లే వివేకా హత్య కేసును తెలంగాణకు బదిలీ చేసిన అంశాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఈ కేసులో గంగిరెడ్డి పాత్ర అపరిమితమని దర్యాప్తులో తేలిందని సీబీఐ తరఫు సీనియర్‌ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణను ముగించిన సుప్రీంకోర్టు.. బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నిర్ణయాన్ని వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news