100మంది ఎక్కువ ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీలు క్యాంటీన్లు ఏర్పాటు చేయాల్సిందే..

-

కొత్త కార్మిక చట్టాల ప్రకారం దేశంలో చాలా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం క్యాంటీన్లతో పాటు పని చేసే స్థలంలో ఒక సంక్షేమ అధికారిని నియమించాల్సి ఉంటుంది. ఈ సంక్షేమ అధికారి చేయాల్సిన పని ఏంటంటే, ప్రభుత్వ పథకాలు కార్మికులకి అందేలా చేయడం. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు సంక్షేమ అధికారి కృషి చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ కొత్త కార్మిక నియమాలు అమల్లోకి రానున్నాయి.

గత ఏడాది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కోడ్ 2020 లో ఈ విషయంలో ప్రత్యేక నిబంధనలు రూపొందించబడ్డాయి. కనీసం 100మంది ఉద్యోగులున్న కంపెనీలు క్యాంటీన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ వందమందిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా లెక్కలోకి వస్తారు. సంక్షేమ అధికారిని కూడా కంపెనీయే నియమించాల్సి ఉంటుంది. వలస కూలీలు ఉన్నట్లయితే వారి ప్రయాణ ఖర్చులన్నీ కంపెనీయే భరించాల్సి ఉంటుంది. అందుకు కావాల్సిన సౌకర్యాలు కంపెనీయే సమకూర్చాల్సి ఉంటుంది.

ఓవర్ టైమ్ పనుల్లో మార్పులు

పనిగంటల కంటే పదిహేను నిమిషాలు ఎక్కువ పనిచేసినా అది ఓవర్ టైమ్ కిందకే వస్తుంది. గతంలో అది అరగంటకి ఉండేది. ప్రతీ ఐదుగంటలకి అరగంట విశ్రాంతి తీసుకునే హక్కు ఉంటుంది. అలా తీసుకున్న అరగంట కూడా పనిగంటల్లో భాగంగానే ఉంటుంది. దాన్ని పనిగంటల్లో పరిగణించాల్సిందే. పనిగంటల విషయమై కార్మికులను ఒత్తిడి చేయకూడదని కొత్త కార్మిక చట్టంలో పేర్కొన్నారు. మొత్తానికి కొత్త కార్మిక చట్టాలు కార్మికులకి మేలు కలిగించేలా ఉన్నాయి. మరి వాటి అమలు ఏ మేర జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news