ప్రపంచాన్నే భయాందోళనకు గురి చేసిన కరోనా మహమ్మారి జంతువులకు కూడా సోకే ప్రమాదం ఉందని, ఇప్పటికే కొన్ని జంతువుల్లో కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి కూడా. అయితే.. జంతువుల కోసం తొలి దేశీయ కరోనా టీకా వచ్చేసింది. హర్యానాకు చెందిన ఐసీఏఆర్-నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ (NRC) జంతువుల కోసం అభివృద్ధి చేసిన దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ కొవిడ్ టీకా ‘అనోకోవ్యాక్స్’ను వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నిన్న ప్రారంభించారు. ఈ వ్యాక్సిన్స్ కరోనా వైరస్లోని డెల్టా వేరియంట్తోపాటు ఒమిక్రాన్ను కూడా సమర్థంగా అడ్డుకుంటుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ తెలిపింది.
శునకాలు, సింహాలు, చిరుతలు, ఎలుకలు, కుందేళ్లను కరోనా వైరస్ నుంచి ఈ వ్యాక్సిన్ రక్షిస్తుందని పేర్కొంది. వ్యాక్సిన్ను దిగుమతి చేసుకోవడం కంటే సొంతంగా అభివృద్ధి చేయడం నిజంగా పెద్ద విజయమని మంత్రి తోమర్ అన్నారు. అనోవ్యాక్స్తోపాటు సీఏఎన్-సీవోవీ-2 ఎలీసా (CAN-CoV-2 ELISA) కిట్ను కూడా మంత్రి ప్రారంభించారు. దీని ద్వారా న్యూక్లియోకాప్సిడ్ ప్రొటీన్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఫలితంగా శునకాల్లో యాంటీబాడీలను గుర్తించొచ్చు.