బీజేపీ బైట్ : ఆత్మ‌కూరు పై అన్న‌గారి కూతురు ఫైర్ ?

-

త్వ‌ర‌లో ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.షెడ్యూల్ కూడా వ‌చ్చేసింది. ఈ నెల 23 ఎన్నిక‌లు, 26న ఫ‌లితాలు రానున్నాయి. ఇదే స‌మ‌యంలో ఆత్మ‌కూరులో రాజ‌కీయం వేడెక్కిపోయింది. అన్న‌గారి కూతురు పురంధేశ్వ‌రి ఇప్పుడ‌క్క‌డ ప్ర‌చారం చేస్తున్నారు. ఆత్మ‌కూరులో ఇసుక, లిక్కర్ మాఫియా జ‌రుగుతుందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏఎస్‌పేట మండలం చౌటభీమవరం గ్రామంలో బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వ‌హించిన సంద‌ర్భంగా ఆమె ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌కు తావిస్తోంది. ఇక్క‌డ ఎమ్మెల్యే మేక‌పాటి గౌతం రెడ్డి చ‌నిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ క్ర‌మంలో ఆయ‌న స్థానంలో బ‌రిలో దిగేందుకు ఆయ‌న త‌మ్ముకు మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి సీన్లోకి వ‌చ్చారు.

మొద‌ట్లో బీజేపీ త‌ర‌ఫున పోటీ ఉండ‌దు అని చాలా మంది ఆశించారు. టీడీపీలానే బీజేపీ కూడా సంప్ర‌దాయాల‌కు విలువ ఇస్తూ త‌ప్పుకుంటుంద‌ని భావించారు. కానీ అనూహ్యంగా బీజేపీ సీన్లోకి వ‌చ్చింది. పురంధేశ్వ‌రి నేతృత్వాన జ‌రుగుతున్న క్యాంపైనింగ్ లో ఇటువంటి వ్యాఖ్య‌లు రావ‌డంతో వైసీపీ పున‌రాలోచ‌న‌లో ప‌డిపోయింది. ఇప్ప‌టికే ఇక్క‌డ స్టార్ క్యాంపైన‌ర్ గా ఉన్న కొడాలి నాని ఏమంటారో అన్న‌ది ఓ ఆస‌క్తి. ఎందుకంటే ఇప్ప‌టికే గుడివాడ ఇష్యూలో కొడాలి నాని త‌న దైన వాగ్బాణాలు సంధించారు పురంధేశ్వ‌రిపై ! త‌న నియోజ‌క‌వ‌ర్గంలో రైల్వే గేట్ల‌పై క‌డుతున్న ఫ్లై ఓవ‌ర్ల‌ను ఆమె అడ్డుకుంటున్నార‌ని, ఇలాంటి పిచ్చి,పిచ్చి ప‌నులు మానుకోవాల‌ని మొన్న‌నే వార్న్ చేశారాయ‌న.

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమె చెప్పిన మాటల‌కు ఏ మేర‌కు నాని రియాక్ట్ అవుతారో ! అదేవిధంగా కేంద్రం అందిస్తున్న వివిధ సంక్షేమ ప‌థ‌కాల నిధులు కూడా ప‌క్క‌దోవ ప‌డుతున్నాయ‌ని, జ‌గ‌న్ స‌ర్కారు ఉద్దేశ పూర్వ‌కంగానే ఈ త‌ప్పు చేస్తోంద‌ని వ్యాఖ్యానించారు పురంధేశ్వ‌రి. ఇవి కూడా వైసీపీని ఇర‌కాటంలో పెట్టేవే! పైకి ఇవి చాలా తేలిక‌యిన మాట‌ల్లా క‌నిపిస్తున్నా ఎప్ప‌టి నుంచో బీజేపీకీ, వైసీపీకీ న‌డుస్తున్న వార్ కు ఈ మాటలే కీల‌కం. ఎందుకంటే ఇవే మాట‌ల‌ను ఎప్ప‌టి నుంచో బీజేపీ చెబుతున్న‌ది క‌నుక !

Read more RELATED
Recommended to you

Latest news