పెళ్లి కాదేమోనన్న భయంతో.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

-

తనకు వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ వివిధ కారణాలతో తప్పిపోవడంతో.. తనకు ఇక పెళ్లి జరగదేమోనన్న భయంతో ఓ మహిళా కానిస్టేబుల్‌ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శాలిబండ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈనెల 2న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం, జైత్వారం గ్రామానికి చెందిన పర్వతాలు కుమార్తె డి.సురేఖ(28) ఛత్రినాక పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ అలియాబాద్‌ కాల్వగడ్డ ఏడు గుళ్ల ప్రాంతంలో తల్లిదండ్రులు, సోదరితో కలిసి ఉంటోంది. గతేడాది సురేఖకు పెళ్లి సంబంధం కుదిరి కొన్ని కారణాల వల్ల రద్దయింది. తాజాగా ఈనెల 1న తమ స్వగ్రామానికి చెందిన ఓ యువకుడితో సురేఖకు నిశ్చితార్థం జరిగింది. అయితే, నిశ్చితార్థం జరిగాక పెళ్లి కుమారుడు పెళ్లి కూతురికి వరుసకు కొడుకు అవుతాడని, జాతకాలు కూడా కుదరడం లేదని ఇరుకుటుంబాలు చర్చించుకుంటుండడంతో ఈ సంబంధం కూడా రద్దయి.. తనకు ఇంకా పెళ్లి జరగదేమోనని మనస్తాపానికి గురైంది.

ఈనెల 2న సురేఖ సోదరి ఉద్యోగానికి వెళ్లి 3న ఉదయం 11 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటి తలుపులు లోపలి నుంచి గడియ పెట్టి ఉండడం, ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో స్థానికులు తలుపులు బద్దలుకొట్టి చూడగా సురేఖ సీలింగ్‌ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించింది. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news