జనాలకు సినిమాపై విరక్తి కలిగింది : నిర్మాత అశ్వినీదత్

-

సినిమా ప్రేక్షకులపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకుకలకు సినిమాలపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగిందని అన్నారు. వారిని థియేటర్‌కు రప్పించడం ఇప్పుడొక సవాల్‌గా మారిందన్నారు. సీఎంల వద్దకు వెళ్లి టికెట్‌ ధరలు పెంచుకోవడమే ప్రస్తుత స్థితికి కారణమని చెప్పారు.

వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకుడు. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌, రష్మిక, సుమంత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం అశ్వినీదత్‌ విలేకరులతో మాట్లాడుతూ.. అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఏపీ ప్రభుత్వం తీరుపైనా మండిపడ్డారు.

‘‘నిర్మాతల శ్రేయస్సు కోసమే అప్పట్లో ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటైంది. ప్రస్తుతం ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. ధరలు తగ్గించాలని ఓసారి.. పెంచాలని మరోసారి చెప్పడం వల్లే సినిమాపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగింది. టికెట్‌ ధరలు పెంచిన వాళ్లే ఇప్పుడు ‘షూటింగ్స్‌ బంద్‌’ అని ఆందోళన చేస్తున్నారు. కరోనాతో పాటు టికెట్ల ధరలను పెంచడం, తగ్గించడం, సినిమాలకు వ్యయం ఎక్కువయ్యిందని సీఎంలతో ధరలను పెంచుకున్నారు. ధరలు పెంచకముందే ఒక సెక్షన్‌ ప్రజలు థియేటర్‌కు రావడం లేదు. సినిమాహాల్‌ క్యాంటీన్‌లలో ఎనలేని రేట్లు పెట్టారు. ఫ్యామిలీతో సినిమా రావాలంటేనే విరక్తి పుట్టేలా చేశారు. ఈ లోపు ఓటీటీలు వచ్చాయి. ఓటీటీలపై దండయాత్ర చేస్తున్నారు. కానీ, థియేటర్‌కు జనం రాకుండా ఓటీటీలో సినిమాలు విడుదల చేయకపోతే సినిమాలు చేయడం కష్టం. ఇష్టారీతిన హీరోలకు పారితోషికాలు ఇస్తున్నారనడం సరికాదు. మార్కెట్‌ ధర ప్రకారమే హీరోలు పారితోషికాలు తీసుకుంటారు. హీరోల పారితోషికాల వల్లే టికెట్‌ ధరలు పెంచారనేది అవాస్తవం. గతంలో సమస్యలొస్తే ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు వంటి హీరోలు రాలేదు. సమస్యలుంటే ఫిల్మ్‌ ఛాంబరే పరిష్కరించేది. ప్రస్తుత నిర్మాతల్లో స్థిరత్వం లేదు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అలాగే ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా అశ్వినీదత్‌ మండిపడ్డారు. తిరుమలలో వెయ్యికాళ్ల మండపం తొలగించినప్పుడు చంద్రబాబును విమర్శించారని అన్నారు. ఆగమశాస్త్రం ప్రకారమే ఆయన వెయ్యికాళ్ల మండపాన్ని తొలగించారని వివరించారు. ప్రస్తుతం తిరుపతిలో జరగని పాపం అంటూ లేదని, ప్రభుత్వం మూడేళ్లలో తిరుపతిని సర్వనాశనం చేసిందని విమర్శించారు. స్వామి ఇంకా పాపాలను ఎందుకు చూస్తున్నాడో తెలియట్లేదని అశ్వినీదత్‌ విచారం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news