గాడ్‌ ఫాదర్ వర్సెస్ ఘోస్ట్‌… దసరాకు బిగ్‌ క్లాష్.. మరి హిట్‌ ఎవరికో!

-

ఇద్దరూ తెలుగు వెండి తెరపై తమదైన ముద్ర వేసినవారే. సూపర్​ హిట్లు, బ్లాక్​ బస్టర్లు అందుకున్నవారే. ‘అబ్బనీ తీయనీ దెబ్బా..’ పాటకు డ్యాన్స్​ చేసినా.. ‘కన్నె పిట్టరో కన్ను కొట్టరో..’ అనే సాంగ్​కు స్టేజ్​ దద్దరిల్లేలా స్టెప్పులేసినా.. వారికే చెల్లింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఇద్దరూ ఒకేసారి తగ్గేదే లే అంటున్నారు. సై అంటే సై అని కదం తొక్కుతున్నారు. ఇంతకీ ఎవరు వారు అనుకుంటున్నారా? వారే తెలుగు అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి, కింగ్​ నాగార్జున. వీరిద్దరు నటించిన సినిమాలు ఇప్పుడు బాక్సాఫీసు వద్ద తలపడనున్నాయి. దీంతో ప్రేక్షకుల్లో అసక్తి మిన్నంటింది. అక్టోబర్ 5న మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్​ ఫాదర్​’, నాగార్జున ‘ఘోస్ట్​’ సినిమాలు దసరా సందర్భంగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

​చిరంజీవి సెంకండ్​ ఇన్నింగ్స్​లో కాస్త ఆలోచించి అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తోంది. విరామం తర్వాత ఆయన ‘ఖైదీ నెం.150’తో రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా అద్భుత విజయం సాధించింది. ఆ తర్వాత సైరా నరసింహా రెడ్డి, ఆచార్యతో ప్రేక్షకులను అలరించారు మెగాస్టార్. ప్రస్తుతం దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన చిత్రం ‘గాడ్​ ఫాదర్​’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా మలయాళ మెగాస్టార్​ మోహన్​ లాల్​ సూపర్ హిట్​ మూవీ ‘లూసిఫర్​’కు రీమేక్​గా రూపొందుతోంది. అయితే ఈ చిత్రానికి అదనపు హంగులు అద్దడం కోసం బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ స్పెషల్​ రోల్ చేశారు. ఇటీవలే చిరు, సల్మాన్ జీప్​లో ఉన్న ఫొటో సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యింది. సల్మాన్ ఖాన్​ మెగాస్టార్​తో చిరు స్టెప్పులేశారు.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆసాంతం ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మెగాస్టార్​ సరికొత్తగా కనిపించనున్నారు. కుర్తా వేసుకుని గడ్డంతో ఉన్న కటౌట్​తో.. ఈ మెగా బాస్​ తన మాస్​ గ్రేస్​ను చూపించబోతున్నారు. గోవిందుడు అందరివాడు సినిమాలో చిరంజీవి గెటప్​కు దగ్గరగా ఉన్న ఈ లుక్​.. మళ్లీ మెగాస్టార్​ జాతరను ‘గాడ్ ఫాదర్’ రూపంలో తీసుకురాబోతోంది.చిరంజీవికి జోడీగా నయనతార సందడి చేయనుంది. ఈ సినిమాలో నయన్.. ఓ పవర్​ఫుల్​ రోల్​లో​ ప్రత్యేకంగా కనిపించనుంది. తమిళ ప్రముఖ నటుడు సముద్ర ఖని, మురళీ శర్మ, టాలీవుడ్ యువ నటుడు సత్యదేవ్​ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

టాలీవుడ్ నవ మన్మధుడు.. నాగార్జున ఎడతెరిపి లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. ‘ఎనీ జోనర్.. ఎనీ వుడ్​.. ఐయామ్ రెడీ’ అంటున్నారు ఈ టాలీవుడ్ డాన్. తాజాగా బ్రహ్మాస్త్రలో వేయి నందుల శక్తితో ఆకట్టుకున్నారు. దసరాకు.. నాగ్​ ‘ఘోస్ట్​’ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం కూడా అక్టోబర్ 5న విడుదల కాబోతుంది. కొరియన్ సినిమాకు రీమేక్​గా రూపొందుతున్న ఈ చిత్రంలో.. భారీ యాక్షన్ సీక్వెన్స్​లతో నాగ్​ అదరగొట్టారని సమాచారం.

ఈ సినిమాలో నాగార్జున ఇంటర్​ పోల్​ ఆఫీసర్​గా విక్రమ్​ అనే పాత్రలో కనిపించబోతున్నారు. నాగార్జునకు జంటగా సోనాల్ చౌహాన్ నటించింది. ప్రవీణ్​ సత్తారు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో.. హై యాక్షన్ సీక్వెన్స్​లు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం తాను జపనీస్ కత్తులతో కత్తిసాములో ట్రైనింగ్ తీసుకున్నానని ఇదివరకే వెల్లడించారు నాగ్. మొత్తం.. యాక్షన్​తో కూడిన థ్రిల్లర్​ను అందించబోతున్నట్లు సంకేతాలిచ్చారు.

గాడ్​ ఫాదర్’, ‘ఘోస్ట్​’ సినిమాలు ఒకే రోజు విడుదల కానుండటం వల్ల ఫ్యాన్స్ ఆనంద పడుతున్నారు. అయితే దీనిపై ఇటీవల నాగ్ ఆసక్తికర కామెంట్లు చేశారు. “దసరా పండుగ అంటేనే ఇలా ఉంటుంది. మామూలుగా 40-50 ఏళ్ల నుంచి రెండు, మూడు సినిమాలు ఈ సందర్భంగా రిలీజ్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా బాగుంటే బాగా ఆడుతుంది.. లేదంటే ఆడదు. అయితే ఏ కంపిటీషన్​ లేకుండా ఒకే సినిమా విడుదలైనా.. బాగా లేకుంటే.. ఆ సినిమా కూడా అడదు” అని నాగార్జున ఇటీవల అన్నారు. గాడ్​ ఫాదర్​తో రాబోతున్న చిరంజీవిని శక్తిమంతమైన అప్పోనెంట్​గా అభివర్ణించారు నాగార్జున. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఎంత మేర కలెక్షన్ల వర్షం కురిపిస్తాయనేది వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news