‘బింబిసార’, ‘సీతారామం’ సక్సెస్​పై నిర్మాతల మండలి కామెంట్స్​.. ఏంటంటే?

-

వేసవి సినిమాల సందడి తర్వాత జులై నెల పూర్తిగా నిరాశపరిచింది. గత నెలలో విడుదలైన ఒక్క సినిమా కూడా ప్రేక్షకుడిని పెద్దగా మెప్పించలేకపోయింది. దీంతో ఆశలన్నీ ఆగస్టుపైనే పెట్టుకుంది చిత్రపరిశ్రమ. ఈ క్రమంలోనే ఆగస్టు మొదటి వారంలో శుక్రవారం ప్రేక్షకులు ముందుకు.. టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో కల్యాణ్​రామ్​ ‘బింబిసార’, ఎమోషనల్‌ లవ్‌స్టోరీగా దుల్కర్​ సల్మాన్​ ‘సీతారామం’ వచ్చి సూపర్​హిట్​ టాక్​ను అందుకున్నాయి. దీంతో చాలా రోజుల తర్వాత థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్‌ బోర్డులు చూస్తున్నామని, ఒకేరోజు రెండు సినిమాలు విడుదలై.. రెండూ సక్సెస్‌ అందుకోవడం ఆనందంగా ఉందంటూ పలువురు సినీప్రముఖులు ట్వీట్​ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విజయంపై తాజాగా నిర్మాతల మండలి కూడా హర్షం వ్యక్తం చేసింది.

“రెండు చిత్రాలు పరిశ్రమకు ఊపిరి పోశాయి. పరిశ్రమ కష్టకాలంలో ఈ సినిమాలు ఆదరణ పొందుతున్నాయి. బింబిసార చిత్రం ప్రేక్షకులను థియేటర్‌కు రప్పిస్తోంది. థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది” అని నిర్మాత మండలి పేర్కొంది.

కాగా, అంతుకుముందు మెగాస్టార్​ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. చిత్రబృందాలను మెచ్చుకుంటూ ఆయన ట్వీట్‌ చేశారు. “ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రావడంలేదని బాధపడుతున్న చిత్రపరిశ్రమకు ఎంతో ఊరటని, మరింత ఉత్సాహాన్నిస్తూ.. కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ శుక్రవారం విడుదలైన చిత్రాలు రెండూ విజయం సాధించడం ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా ‘సీతారామం’, ‘బింబిసార’ నటీనటులు, నిర్మాతలు, ఇతర సాంకేతిక బృందానికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు” అని చిరు పేర్కొన్నారు.

మరో నటుడు విజయ్‌ దేవరకొండ సైతం ఈ రెండు చిత్రాల విజయాలపై స్పందిస్తూ.. “ఒకే రోజు విడుదలైన రెండు చిత్రాలూ విజయం అందుకున్నాయని తెలిసి ఎంతో ఆనందంగా ఉంది. వాట్‌ ఏ గుడ్‌ డే..!! వైజయంతి మూవీస్‌, దర్శకుడు హను రాఘవపూడి, దుల్కర్‌ సల్మాన్‌, సుమంత్‌, మృణాల్‌, రష్మిక అందరికీ అభినందనలు. మీ సినిమా గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు వింటున్నా. ఇక, విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ‘బింబిసార’ టీమ్‌ నందమూరి కల్యాణ్‌ రామ్‌, వశిష్ఠ, కీరవాణి.. ఇతర బృందం మొత్తానికి శుభాకాంక్షలు” అని విజయ్‌ ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news