తెలంగాణ తిరుపతి శ్రీకురుమూర్తి క్షేత్ర విశేషాలు ఇవే !

-

తెలంగాణ రాష్ట్రంలో కొలువైన అత్యంత పురాతన ఆలయాల్లో శ్రీ కురుమూర్తిక్షేత్రం ఒకటి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రజలు కురుమూర్తిస్వామిని ఇష్టదైవంగా కొలుస్తారు. నాలుగు సంవత్సరాల క్రితం కొండగుహలలో కొలవుదీరిన స్వామికి ఏడెనిమిది వందల సంవత్సరాల నుండి ముక్కర వంశరాజులు పూజించి, తరించారు. ఈ స్థల పురాణం తెలుసుకుందాం..

 

స్థల పురాణం..

కుబేరుడి అప్పు తీర్చలేక పద్మావతి సమేతంగా శ్రీ వేంకటేశ్వరుడు తిరుమల వీడి కృష్ణాతీరం చేరి… అక్కడ నదిలో కాసేపు సేద తీరారు. అనంతరం ఆయన పాదాలు కంది పోకుండా కృష్ణమ్మ పాదుకలు బహుకరించిందని, ఈ పాదుకలనే ఉద్దాల ఉత్సవంలో ఊరేగిస్తారని చరిత్రాత్మక కథనం ప్రచారంలో ఉంది. నాడు శ్రీ వేంకటేశ్వరుడు సతీసమేతంగా కృష్ణానదిలో స్నానమాడిన ప్రదేశం నేడు ఆత్మకూరు ప్రదేశంలొ గుండాల జలాశయంగా ప్రసిద్ధి చెందింది.

పాలమూరు జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌ గ్రామ సమీపంలో ఏడు కొండల మధ్య స్వయంబువంపై లక్ష్మి సమేతంగా వెలిశారు. ఈ ఆలయానికి ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది. రాజుల పాలనలో ఆలయాన్ని అబివృద్దిలోకి వచ్చింది. తిరుపతి కురుమతిగా పేరొందుతూ పేదల తిరుపతిగా స్వామి మొక్కులందుకుంటున్నారు. తిరుపతిలో శ్రీవెంకటేశ్వరస్వామి ఏడు కొండల మధ్య వెలిస్తే ఇక్కడ కూడా ఏడుకొండల మధ్య స్వామి కొలువయ్యారు. పూర్వం కురుమూర్తికి కురుపతి అనే పేరు కూడా ఉన్నట్లు ఆలయ చరిత్ర బట్టి తెలుస్తోంది.

తిరుపతి క్షేత్రం పర్వతపుత్రుడై ఆనందగిరిపై శ్రీనివాసుడు వెలియగా, ఇక్కడ కురుమూర్తి పర్వతమున అనంతగిరిలోని ఒక భాగమేనని అక్కడ వెలిసిన స్వామివారే ఇక్కడ వెలిశాడని ఈ క్షేత్ర స్థలపురాణాలను బట్టి తెలుస్తోంది. స్వామి వారి మూర్తి విగ్రహంలో కూడా తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామిని పోలిన భంగిమలు ఉన్నాయి. తిరుమల ఎక్కేటప్పుడు మొదట శ్రీపాదాలు ఉన్నట్లే కురుమతిలో కూడా శ్రీ స్వామి కొండపైకి ఎక్కేటప్పుడు పాదాలు ఉన్నాయి. ముక్కరవంశ రాజులు చేయించిన స్వామి ఆభరణాలే స్వామివారికి బ్రహ్మోత్సవాల సమయంలో అలంకరిస్తారు. స్వామి వారి ఆలయంలో 1350 ప్రాంతంలో నిర్మాణం జరిగినట్లు ఆధారాల బట్టి తెలుస్తోంది.

విశేషాలు: తిరుపతి లాగేనే ఇక్కడా విఘ్నేశ్వరుడి విగ్రహం లేదు.
తిరుపతి లాగానే ఇక్కడ కూడా ఏడుకొండల మద్య వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు.
తిరుపతిలాగానే ఇక్కడా స్వామి నిలుచున్న భంగిమలో ఉన్నాడు. తిరుమలకు మెట్లపై వెళ్ళేటప్పుడు శ్రీపాద చిహ్నాలు ఉన్నట్లుగానే ఇక్కడా ఉన్నాయి. కురుమూర్తి దర్శనానికి వెళ్తున్నప్పుడు మోకాళ్ళ గుండు ఉంది. శేషశైలంలో స్వామి వారికి అలిపిరి మండపంలాగే ఇక్కడ ఉద్దాల మండపం ఉంది. ఇలా తిరుమలతిరుపతిలాగా ఇక్కడ అనేక విషయాలు ఒకేలా ఉండటం భక్తులు దీన్ని తెలంగాణ తిరుపతిగా అభివర్ణిస్తారు. ఈ క్షేత్ర సందర్శనతో సకల పాపాలు పోవడమే కాకుండా సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రకృతి రమణీయతతో అలరారించే ఈక్షేత్రం తప్పక దర్శించదగ్గ పుణ్యక్షేత్రం.

-శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news