తిరుమల జూన్‌ ఆర్జిత సేవా టికెట్లు విడుదల !

-

జూన్ నెల ఆర్జిత సేవలు.. అందుబాటులో 60 వేలకుపైగా టిక్కెట్లు

తిరుమల స్వామి దర్శనం కోసం భక్తులు పడే పాట్లు చెప్పనలవి కాదు.కానీ ఆయన దర్శనం తర్వాత అన్నీ మర్చిపోతారు. స్వామి సెకన్లపాటు కన్పిస్తే చాలు ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. అయితే స్వామి దర్శనమే కాకుండా స్వామికి జరిగే ఆయా సేవలను ఆర్జిత సేవలుగా భక్తులు పాల్గొనేలా టీటీడీ కార్యక్రమాలను చేపడుతుంది. అయితే ఆయా సేవలకు సంబంధించిన టికెట్లను అందరూ పొందేలా మూడునెలల ముందే టీటీడీ విడుదల చేస్తుంది. జూన్‌ నెలకు సంబంధించి శ్రీవారి అర్జితసేవ ఆన్‌లైన్‌ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం విడుదల చేసింది. జూన్‌ నెల కోటాకు మొత్తం 60,666 అర్జితసేవ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. జనరల్ కేటగిరీలో 50,700 టిక్కెట్లు కాగా, మిగతావి ఆన్‌లైన్ లక్కీ డిప్ ద్వారా కేటాయించేవి. జనరల్‌ కేటగిరిలోని మొత్తం 50,700 టిక్కెట్లలో విశేషపూజ 1,500, కళ్యాణోత్సవం 13,300, ఊంజల్‌సేవ 4,200, అర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 6,600, సహస్రదీపాలంకార సేవ 17,400 టికెట్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 9,966 టికెట్లు విడుదల చేశారు. ఇందులో సుప్రభాతసేవ 7,681, తోమాల 130, అర్చన 130, అష్టదళపాదపద్మారాధన 300, నిజపాదదర్శనం 1,725 టిక్కెట్లు ఉన్నాయి.

లక్కీ డిప్ ద్వారా కేటాయించే టిక్కెట్ల కోసం శుక్రవారం ఉదయం 10 నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. మార్చి 10న మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానంలో భక్తులను ఎంపిక చేసి టిక్కెట్లను కేటాయిస్తామని పేర్కొంది. ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా కేటాయించే టిక్కెట్లకు ముందుగా భక్తులు తమ పేర్లను నమోదుచేసుకోవాలి. మంగళవారం ఉదయం 10 గంటల్లోగా పేర్లను నమోదుచేసుకున్న భక్తులకు డిప్ విధానంలో టిక్కెట్లు కేటాయిస్తారు.

లక్కీ డిప్‌ ద్వారా టిక్కెట్ల పొందిన భక్తుల మొబైల్స్‌కు సమాచారం ఇస్తారు. వీరు ఆన్‌లైన్ నగదు చెల్లించి టిక్కెట్లను ఖరారు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ జనరల్‌ కేటగిరి కింద విశేషపూజ, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ టిక్కెట్లను విడుదల చేసిన వెంటనే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

సేవా టికెట్ల కేటాయింపులో గతేడాది టీటీడీ కీలక మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పాత విధానంలోని లోపాలను అక్రమార్కులు తమకు అనుకూలంగా మలచుకోవడంతో టీటీడీ కొత్త నిబంధనలు రూపొందించింది. కొత్త నిబంధన ప్రకారం.. ఒక మెయిల్‌ ఐడీ, ఒక ఫోన్‌ నెంబరుతో మాత్రమే బుక్‌ చేసుకోవాలి. గతంలో ఈ విధానం లేకపోవడంతో వందలాది నకిలీ ఐడీలతో పేరు నమోదు చేసుకోవడం, ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానంలో టిక్కెట్లు దక్కించుకుని, వాటిని ఇతరులకు అమ్ముకుని సొమ్ము చేసుకోవడం తెలిసిందే. ఇక ఆలస్యమెందుకు స్వామి దర్శనంతోపాటు స్వామి సేవలలో పాల్గొనే అవకాశాన్ని వినియోగించుకుని స్వామి కృపకు పాత్రులు కండి. ఓం నమో వేంకటేశాయ.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news