ప్ర‌పంచ క‌ప్‌లో భార‌త్ పాక్‌తో మ్యాచ్ ఆడ‌వ‌ద్దు.. అభిమానుల డిమాండ్‌..!

-

ఇండియా-పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య క్రికెట్ మ్యాచ్ జ‌రుగుతుందంటే చాలు.. ఇరు దేశాల క్రికెట్ అభిమానుల‌కు పండ‌గేన‌ని చెప్ప‌వ‌చ్చు. అనేక భావోద్వేగాల‌కు అలాంటి మ్యాచ్‌లు వేదిక‌ల‌వుతుంటాయి. అయితే తాజాగా పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల‌పై పాక్ ఉగ్ర‌వాదులు దాడి జ‌ర‌ప‌డంతో ఇక‌పై పాక్‌తో అస‌లు క్రికెట్ మ్యాచ్‌లు ఏ ర‌కంగా కూడా ఆడ‌కూడ‌ద‌ని యావ‌త్ భార‌త క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేర‌కు అటు బీసీసీఐతోపాటు ఇటు విరాట్ కోహ్లి, ధోనీ లాంటి ప్ర‌ముఖ ప్లేయ‌ర్ల‌కు కూడా పాక్‌తో క్రికెట్ ఆడ‌వ‌ద్ద‌ని అభిమానులు ట్వీట్లు పెడుతున్నారు.

ఇంగ్లాండ్ వేదిక‌గా మే 30వ తేదీ నుంచి వ‌న్డే క్రికెట్ ప్రపంచ క‌ప్ జ‌ర‌గ‌నున్న విష‌యం విదిత‌మే. కాగా ఆ టోర్న‌మెంట్‌లో భాగంగా ఇండియా పాక్‌తో జూన్ 16వ తేదీన మ్యాచ్ ఆడ‌నుంది. కానీ ఆ మ్యాచ్‌ను టీమిండియా ఆడ‌కూడ‌ద‌ని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ముంబైలో ఉగ్ర‌వాదులు దాడి జ‌రిపినప్ప‌టి నుంచి భార‌త్ పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడ‌డం లేదు. కేవ‌లం ఐసీసీ నిర్వ‌హిస్తున్న ప్రపంచ క‌ప్‌, చాంపియ‌న్స్ ట్రోఫీ, ఆసియా క‌ప్ లాంటి టోర్న‌మెంట్‌ల‌లోనే పాక్‌తో భార‌త్ ఆడుతోంది.

అయితే తాజాగా పుల్వామా దాడితో తీవ్రంగా మ‌న‌స్థాపానికి గురైన భార‌త ప్ర‌జ‌లు ఇకపై పాకిస్థాన్‌తో అస‌లు ఏ ర‌కంగా కూడా మ్యాచ్‌లు ఆడ‌కూడ‌ద‌ని, క‌నీసం ఐసీసీ టోర్న‌మెంట్‌ల‌లో కూడా క్రికెట్ మ్యాచ్ లు ఆడ‌రాద‌ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచ క‌ప్‌లో భార‌త్-పాకిస్థాన్ మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతుందా, లేదా అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానులు మాత్రం పాక్‌తో మ్యాచ్ ఆడ‌వ‌ద్ద‌నే కోరుకుంటున్నారు. పుల్వామా దాడి ఘ‌ట‌న వెన‌క ఉన్న పాకిస్థాన్ దుశ్చ‌ర్య‌ను ప్ర‌పంచ దేశాల‌కు తెలియ‌జేయాలంటే.. భార‌త్ పాక్‌తో మ్యాచ్ ఆడ‌వ‌ద్ద‌ని అభిమానులు అంటున్నారు.

అయితే ఒక వేళ నిజంగానే భార‌త్ పాక్‌తో మ్యాచ్ ఆడ‌క‌పోతే రెండు పాయింట్ల‌ను పాక్ ఖాతాలో జ‌మ చేస్తారు. అయిన‌ప్ప‌టికీ మ్యాచ్ ఆడ‌క‌పోవ‌డ‌మే మేల‌ని, దాంతోనైనా టీమిండియా వీర జవాన్ల‌కు ఘ‌న నివాళి అర్పించిన‌ట్లు అవుతుంద‌ని అభిమానులు అంటున్నారు. మ‌రి, ప్ర‌పంచ క‌ప్ లో భార‌త్ పాక్ తో మ్యాచ్ ఆడుతుందా, లేదా అన్న‌ది తెలియాలంటే మ‌రికొద్ది నెల‌లు ఆగ‌క త‌ప్ప‌దు..!

Read more RELATED
Recommended to you

Latest news