సుప్రీం నోటీసులు: రామోజీకి మరో బ్యాడ్ న్యూస్!

-

ఇప్పటికే కరోనా రూపంలో ఆదాయానికి గండిపడటం.. ఎన్నడూ లేనివిధంగా “ఈనాడు” సంస్థలో ఉద్యోగస్తులను తీసేయడం.. సర్క్యులేషన్ పడిపోవడం వంటి ఇక్కట్లతో ఉన్నారని చెబుతున్న రామోజీకి.. అప్పట్లో సంచలనం రేపిన మార్గదర్శి కేసుకు సంబందించి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం నిబంధనలకు విరుద్ధంగా 2,600 కోట్ల రూపాయలను, సుమారు రెండున్నర లక్షల మంది నుంచి రామోజీరావు డిపాజిట్ల రూపంలో సేకరించారని మాజీ ఐజి కృష్ణంరాజు గతంలో ఫిర్యాదు చేశారు. ఉమ్మడి హిందూ కుటుంబం (హెచ్.యు.ఎఫ్) ద్వారా డిపాజిట్ల సేకరించడం చట్టరీత్యా నేరం కాదని ఉమ్మడి హైకోర్టు ముందు రామోజీ రావు వాదనలు కూడా వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు రామోజీరావుకి నోటీసులు జారీ చేసింది.

అదేవిధంగా ఉమ్మడి హిందూ కుటుంబం (హెచ్.యు.ఎఫ్) అనేది ఒక వ్యవస్థ కాదు, ఒక కంపెనీ అంతకంటే కాదు. ఫరమ్ అస్సలు కాదు, వ్యక్తుల సమూహం కూడా అయ్యేందుకు వీలులేదు. కాబట్టి, “ఆర్బీఐ చట్టం” సెక్షన్ 45 (ఎస్) నిబంధనలు వర్తించవని రామోజీ రావు చేసిన వాదనలతో అంగీకరించి ఉమ్మడి హైకోర్టు విభజన రోజున ఈ కేసును కొట్టివేసింది. అయితే అలాగే… గోప్యంగా ఉంచిన ఉమ్మడి హైకోర్టు తీర్పును, ఆలస్యంగా గ్రహించిన ఉండవల్లి తేరుకొని తిరిగి కోర్టును ఆశ్రయించారు. అప్పుడు 266 రోజుల పాటు జరిగిన జాప్యాన్ని మన్నించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఉండవల్లి ఆశ్రయించారు.

కాగా ఉండవల్లి పిటిషన్ ను విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రిజర్వ్ బ్యాంకు, మాజీ ఐజి కృష్ణంరాజును కూడా ఈ కేసులో ఇంప్లీడ్ చేయాలని కోరిన ఉండవల్లి దరఖాస్తులకు అనుమతి మంజూరైనట్లు అయింది. కాగా ఈరోజు రామోజీరావుకు, మార్గదర్శి ఫైనాన్సియర్స్ కు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు, కృష్ణంరాజుకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ నోటీసులకు లిఖిత పూర్వక సమాధానాలు దాఖలు చేసిన తర్వాత సుప్రీం కోర్ట్ తమ తదుపరి విచారణను చేపట్టనునుంది.

Read more RELATED
Recommended to you

Latest news