ఆ న‌లుగురు.. వైసీపీ ఎంపీల మ‌ధ్య హాట్ టాపిక్‌..!

-

వైసీపీకి ఉన్న 22 మంది ఎంపీల్లో న‌లుగురు మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఎన్నిక‌లు ముగిసి ఏడాది పూర్త‌యిన నేపథ్యంలో ఎంపీల గ్రాఫ్‌పై అధ్య‌య‌నం చేస్తున్న మిత్రుల‌కు ఈ న‌లుగురు ప్ర‌త్యేకంగా క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసి ఏడాది పూర్త‌యింది. ఈ ఏడాదిలో వైసీపీ ఎంపీలు ఏం చేశారు? ఏం సాధించారు? ఎలా ఉన్నారు? అనే చ‌ర్చ సాధార ణంగానే జ‌రుగుతోంది. ఈ మొత్తం 22 మందిలో న‌లుగురు స్పెష‌ల్‌గా క‌నిపిస్తున్నారు. వారే మ‌హిళా ఎంపీలు. అమ‌లాపురం నుంచి విజ‌యం సాధించిన చింతా అనురాధ‌, అన‌కాప‌ల్లి నుంచి గెలుపు గుర్రం ఎక్కిన బీశెట్టి స‌త్య‌వ‌తి, కాకినాడ నుంచి గెలిచిన వంగా గీత‌, అర‌కు నుంచి విజ‌యం సాధించిన గొట్టేటి మాధ‌విల పేర్లు బెస్ట్ ఎంపీల జాబితాలో ఉండ‌డం గ‌మ‌నార్హం.

అమ‌లాపురం నుంచి గెలిచిన చింతా అనురాధ 39966 ఓట్ల ఆధిక్య‌త‌తో విజ‌యం సాధించారు. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గ‌మైన ఇక్కడ చేయాల్సిన అభివృద్ది కార్య‌క్ర‌మాలు కూడా ఉన్నాయి. వీటికి ప్రాధాన్యం ఇస్తూనే అనురాధ ముందుకు సాగుతున్నారు. నియోజ ‌క‌వ‌ర్గంలో అందుబాటులో ఉండ‌డంతోపాటు.. కేంద్ర ప‌థ‌కాల‌ను ఇక్క‌డ అమ‌లు చేయ‌డంలోను స‌త్తా చాటుతున్నారు. అదేస‌మ ‌యంలో వివాద ర‌హితంగా నాయ‌కుల‌ను క‌లుపుకొని పోతున్నారు. విశాఖ జిల్లా అన‌కాప‌ల్లి నుంచి విజ‌యం సాధించిన స‌త్య‌వ తి వృత్తి రీత్యా వైద్యురాలు. అయితే, జ‌గ‌న్ ఆమెకు టికెట్ ఇచ్చారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో 89192 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. నిజానికి అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం చాలా కీల‌కమైన నియోజ‌క‌వ‌ర్గం.

గ‌తంలో ఎంతో మంది సీనియ‌ర్లు ఇక్క‌డ నుంచి ప్రాతినిధ్యం వ‌హించారు. ఇలాంటి చోట త‌న‌మార్కు క‌నిపించేలా స‌త్య‌వ‌తి దూసుకుపోతున్నారు. ఇక‌, మ‌రో ఇద్ద‌రు ఎంపీలు మ‌రింత స్పెష‌ల్ గా ముందుకు సాగుతున్నారు. తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ నుంచి గెలిచిన వంగా గీత నిత్యం ప్ర‌జల మ‌ధ్యే ఉంటున్నారు. ఈమె 25738 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. అయినా.. కూడా ఎక్క‌డా ఎలాంటివిభేదాలు లేకుండా ముందుకు సాగుతున్నారు. ప్ర‌జ‌ల‌కు ఏక‌ష్టం ఉన్నా.. నేనున్నానంటూ.. అక్క‌డ వాలిపోతున్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ అందుబాటులో ఉంటున్నారు. వైసీపీలోనూ అంద‌రినీ క‌లుపుకొని ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ విజ‌న్‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

దీంతో ఆమె గ్రాఫ్ దూసుకుపోతోంద‌ని అంటున్నారు. ఇక‌, అర‌కు నుంచి విజ‌యం సాధించిన గొట్టేటి మాధ‌వి ఏకంగా 2 ల‌క్ష‌ల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజ‌యంసాధించారు. ఎంపీగా ఉంటూనే ఇటీవ‌ల వివాహం చేసుకున్నారు. అయితే, ప్ర‌జాసేవ‌లో మాత్రం కుటుంబాన్ని సైతం ప‌క్క‌న‌పెట్టి ముందుకు సాగుతున్నారు. దీంతో ఈమెకు కూడా మంచి మార్కులు ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. ఎక్క‌డా కూడా ఎలాంటి అవినీతి ఆరోప‌ణ‌లు లేకుండా, వివాదాల‌కు తావులేకుండా.. జ‌గ‌న్ సూచ‌న‌లు, విజ‌న్ మేర‌కు ప‌నిచేస్తుండ‌డం మ‌హిళా ఎంపీలకు బాగా క‌లిసి వ‌చ్చిన అంశంగా మారింద‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news