‘ ఇసుక ‘ లో కాలేసిన జగన్ ? ఇప్పుడు ఇలా సెట్ చేశారా ?

-

ఒక్కో విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత ముందుచూపుతో వెళ్ళినా, చివరకు అది బెడిసి కొడుతూ ఉంటుంది. ఏపీ సీఎం జగన్ విషయంలోనూ ఇదే రకమైన తంతు జరిగింది. టిడిపి ప్రభుత్వం హయాంలో ఇసుక విధానం లోపభూయిష్టంగా ఉండటం, అవినీతికి ఆస్కారం గా మారడం, టిడిపి నాయకులకు ప్రధాన ఆదాయ వనరుగా అది మారడం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడం వంటి వ్యవహారాలు అన్నిటినీ లెక్కలోకి తీసుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఇసుక విధానాన్ని ప్రక్షాళన చేసి పారదర్శకంగా ప్రజలకు ఇసుక అందించాలని,  ప్రజల ఇబ్బందులు ఎదుర్కోకుండా, ఎక్కడా అవినీతికి చోటు లేకుండా చేసి, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని, ఇలా ఎన్నో రకాలుగా ఆలోచించి, పాత ఇసుక విధానాన్ని రద్దు చేశారు.అయితే కొత్త ఇసుక పాలసీ విధానాన్ని ప్రకటించకుండానే, పాత పాలసీ రద్దు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇక కొత్త పాలసీ రూపొందించి అమలు చేద్దామనుకునే సరికి ఆకస్మాత్తుగా ఏపీ లో వరదలు రావడం, భారీ వర్షాలు ఏపీని ముంచెత్తడం, ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఫలితంగా ప్రజలకు ఇసుక అందకపోవడంతో, నిర్మాణ రంగం మొత్తం కుదేలయింది. దీంతో ఆ రంగంపై ఆధారపడిన వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి ఇసుక విధానం లో ఏదో రకమైన ఇబ్బంది వస్తూనే ఉంది. కొత్తగా అనేక నిబంధనలు రూపొందించి ఇసుక పాలసీని అమలు చేస్తున్నా, ప్రజలకు మాత్రం అది అందే విషయంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ప్రభావం వైసీపీ ప్రభుత్వం పై స్పష్టంగా కనబడటం, ఒక వైపు సంక్షేమ పథకాలతో వచ్చిన క్రెడిట్ మొత్తం, ఇసుక పాలసీ కారణంగా పోవడం వంటి వ్యవహారాలు జగన్ దృష్టికి రావడంతో, తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఇసుక పాలసీ విషయమై జగన్ మంత్రులతో చర్చించి ఈ సందర్భంగా ఇసుక పాలసీ విధానం ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, ఇప్పటి కంటే మెరుగైన పాలసీ తీసుకురావడం ద్వారా, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవాలని, జగన్ కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చారు.
ఇకపై ఇసుక రీచ్ నుంచి స్టాక్ పాయింట్ వరకు, అక్కడి నుంచి ప్రజలకు రవాణా చేసే విషయంలో గజిబిజి నిబంధనలు అన్నిటిని తీసివేయాలని, క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అలాగే ఇకపై ఇసుక యూనిట్ ధర 475 రూపాయలకు మించకుండా ఉండే విధంగా ఈ  కొత్త పాలసీ రూపొందించినట్లు సమాచారం. ఈ మేరకు కొత్త ఇసుక పాలసీ ఏపీ కేబినెట్ ఆమోదించింది. అలాగే కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం మేరకు ఆఫ్ లైన్ లో తీసుక పొందే విధానానికి రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఇసుక వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు రాకుండా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో వీటిని నిర్వహించేలా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈ వ్యవహారం లో ముందుకు రాకపోతే 13 జిల్లాలను మూడు భాగాలుగా విభజించి టెండర్లు పిలవాలని, కేబినెట్ సమావేశంలో నిర్ణయించుకున్నారు. మొత్తానికి ఇసుక దెబ్బ వైసీపీ ప్రభుత్వానికి గట్టిగానే తగినట్టుగా కనిపిస్తోంది. ముందు ముందు ప్రభుత్వానికి ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉండటంతో, ఆకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తున్నారు.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news