హామీ ఇచ్చాం కానీ.. అధికారంలోకి వచ్చాక సాధ్యం కాదని తెలిసింది : మంత్రి బొత్స

-

సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవమే కానీ అధికారంలోకి వచ్చాకే అది సాధ్యం కాదని తెలిసిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అన్నీ పరిశీలించిన తర్వాత సీపీఎస్ రద్దు సాధ్యం కాదనే విషయం తేలిందని తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే చెప్పారన్నారు.

సీపీఎస్ రద్దు చేసే అంశంలో ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయని బొత్స చెప్పారు. సీపీఎస్ కంటే మెరుగైన విధానం అమలు చేసేందుకే ప్రభుత్వం జీపీఎస్ తీసుకువచ్చిందని అన్నారు. ఉద్యోగ సంఘాలతో జరిగే కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో జీపీఎస్ విధానం అమలుపై మరిన్ని అంశాలు చర్చించనున్నట్లు వెల్లడించారు.

‘‘ఇప్పటివరకు మా ఇంట్లో నాతో జరిగిన సమావేశాలు అనధికారికమే. ఇవాళ ఉద్యోగ సంఘాలతో జరిపే సమావేశం పూర్తిగా అధికారికమైంది. ఇవాళ్టి సమావేశానికి రావాలని అన్ని ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది. సమావేశానికి అన్ని ఉద్యోగ సంఘాల నేతలు వస్తారని ఆశిస్తున్నాం. వారు రాకపోతే సీపీఎస్ విధానం బాగుందని ఉద్యోగ సంఘాలు అనుకుంటున్నట్లు ప్రభుత్వం భావించాల్సి ఉంటుంది. ఉద్యోగ సంఘాల నేతలు సమావేశానికి రాకుండా బహిష్కరిస్తే.. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తాం’’ అని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news