విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

-

విద్యుత్‌ శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్లు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ కి లేఖ రాశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. విద్యుత్‌ శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్లు, ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం అనేక నెలలుగా ఆందోళన చేస్తున్నారని.. దాదాపు 23వేల మందికి పైగా ఉన్న వీరి సమస్యల పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గర్హనీయం అని లేఖలో పేర్కొన్నారు.

“ఆర్టిజన్లు, ఉద్యోగుల పట్ల విద్యుత్‌ శాఖ యాజమాన్యం, రాష్ట్ర సర్కార్‌ కనీసం శ్రద్ధ చూపకపోవడం ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మీ ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని కనబరుస్తుంది. జీపీఎఫ్‌, పీఆర్‌సీ వంటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. 1999 నుండి 2004 మధ్య కాలంలో విద్యుత్‌ సంస్థల్లో నియమితులైన వారికి జీపీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌లు న్యాయబద్ధమైనవి. తెలంగాణ ఉద్యమంలో విద్యుత్‌ శాఖ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు.

అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ప్రభుత్వ పాలనలో విద్యుత్‌ శాఖ అత్యంత కీలకమైనది. ఆర్టిజన్లు, విద్యుత్‌ ఉద్యోగులు సమ్మెలోకి దిగితే మొత్తం రాష్ట్ర పాలనా యంత్రాంగమే కుప్పకూలుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మీ ప్రభుత్వానికి మొదటి నుండీ చిన్నచూపే. ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. కొత్త పీఆర్‌సీ గురించి ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు.

దేశంలోనే మెరుగైన వైద్య సదుపాయం అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకొనే మీ ప్రభుత్వం ఉద్యోగులు కోరుతున్న నగదు రహిత మెడికల్‌ పాలసీకి ఎందుకు వెనకాడుతుంది? పదవీ విరమణ సహా ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇన్సెంటీవ్‌లు, పీఆర్‌సీ, జీపీఎఫ్‌ వంటి సమస్యల విషయంలో ప్రభుత్వం వెంటనే ఉద్యోగులు, ఆర్టిజన్లతో చర్చలు జరపాలని బిజెపి డిమాండ్‌ చేస్తుంది. తమ న్యాయమైన కోరికలు పరిష్కరించని పక్షంలో తెలంగాణ ఉద్యోగులు ఈ ప్రభుత్వంపై తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరిస్తున్నాను” అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news