కరీంనగర్ జిల్లాకి మెడికల్ కాలేజీ తెచ్చుకోలేని దద్దమ్మ బండి సంజయ్ – మంత్రి ఎర్రబెల్లి

-

నేడు కరీంనగర్ జిల్లా వెలిచాల గ్రామంలో పర్యటించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకి ఇద్దరే ఇద్దరు ఇష్టమని.. పేదల గురించి ఆలోచించిన ఎన్టీఆర్, కెసిఆర్ లేనని అన్నారు. ఆయన కర్ణాటక వెళ్ళినప్పుడు అక్కడ ఓ వృద్ధురాలిని పెన్షన్ ఎంత వస్తుంది అని అడిగితే 500 ఇస్తున్నారని చెప్పారని.. అది కూడా 2 వేల మంది ఉంటే 20 మందికి మాత్రమే ఇస్తున్నారని ఆ వృద్ధురాలు తెలిపినట్లు చెప్పారు.

కానీ తెలంగాణలోని ఒక్క వెలిచాల గ్రామంలోనే 780 మందికి ఇస్తున్నామన్నారు. బండి సంజయ్ దుమ్ము లేపుతా అంటున్నాడని.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో పెన్షన్ ఎంత ఇస్తున్నారని ప్రశ్నించారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో తెలంగాణ కంటే తక్కువ పెన్షన్లు ఇస్తున్నారని అన్నారు. అలాగే బిజెపి పాలిత రాష్ట్రాలలో కేవలం 6 గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారని.. అందులో మోటార్లకు మీటర్లు పెట్టి ఒక్కొక్క మోటారుకు లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బిజెపి నాయకులు దొంగలు, దుర్మార్గులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇదే పాదయాత్ర దమ్ముంటే కర్ణాటక, ఉత్తరప్రదేశ్లో చేద్దాం రండి అంటూ సవాల్ విసిరారు. తెలంగాణలోని పథకాలు, అక్కడి పథకాలు సమానంగా ఉంటే ,ఎక్కువ లబ్ధి ఉంటే గులాం గిరి చేయడానికి సిద్ధం అని అన్నారు. బండి సంజయ్ తుపాకి రాముని లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిల్లాకి మెడికల్ కాలేజీ తెచ్చుకోలేని దద్దమ్మ బండి సంజయ్ అంటూ మండిపడ్డారు. బిజెపి వల్ల దేశం నాశనమవుతుందని.. రాష్ట్రానికి రావలసిన నిధులు ఇవ్వడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news