కరోనా ఎఫెక్ట్.. స్వీయ నిర్బంధంలో కేంద్ర మాజీ మంత్రి

-

కరోనాపై పోరాటం కంటికి కనిపించని శత్రువుతో బయటకు కనిపించని యుద్ధంలా మారింది. కరోనా వైరస్‌కు మందు లేకపోవడంతో.. నివారణ చర్యలే శరణ్యమయ్యాయి. కరోనా సోకిన వారిలో అధిక శాతం విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన వారే కావడంతో.. విదేశీ ప్రయాణికులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఉంచింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల విదేశాల నుంచి తిరిగివచ్చిన మాజీ కేంద్ర మంత్రి, బీజీపీ ఎంపీ సురేష్ ప్రభు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలో భాగంగా స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్టు ప్రకటించారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు రాసిన లేఖలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.


సౌదీఅరేబియాలో మార్చి 10న జరిగిన జీ-20 దేశాలకు సంబంధించిన సమావేశంలో సురేష్ ప్రభు పాల్గొన్నారు. ఆ తర్వాత ఇండియాకు వచ్చిన ఆయన కరోనా నిర్ధారణ టెస్ట్‌లు చేయించుకోగా నెగిటివ్‌గా తేలింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. 14 రోజుల పాటు నిర్బంధం ముగిసేవరకు పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాలేనని వెంకయ్యకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తోటి ఎంపీలు, పార్లమెంట్ సిబ్బంది ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news