ఆ దేశంలో ప్రాణాలు కాపాడుకోవడానికి కార్లను లాక్ చేయరట.!

-

ఎక్కడైనా సరే..కార్ పార్క్ చేసినప్పుడు లాక్ చేసుకుంటాం కదా.. ఒకటికి రెండుసార్లు డోర్స్ అన్నీ లాక్ అయ్యాయో లేదే బాగా చూసుకుని వెళ్తాం. అసలే దొంగల భయం.. అలాంటప్పుడు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే.. కారులో ఉన్న విలువైన వస్తువులు దొంగలమయం అయిపోతాయి. కాబట్టి కారు పార్క్ చేసినప్పుడు లాక్ చేయటం అనేది కంపల్సరీ.. కానీ ఆ దేశంలో ఒక నగరంలో మాత్రం ప్రజలు తమ కార్లను అసలు లాక్ చేయరట.. 24గంటలు అలానే ఉంటాయి. అదేంటి.. అలా ఎందుకు వదిలేస్తున్నారు అనేగా మీ డౌట్.. ఇంతకీ ఆ దేశం ఏంటి.. వాళ్లు అలా ఎందుకు లాక్ చేయటం లేదో చూద్దాం..

కెనడాలోని ఓ నగరంలో ప్రజలు తమ కార్లను అసలు లాక్‌ చేయరు. 24/7 కార్లు అన్‌లాక్‌లోనే ఉంటాయి. ఎందుకంటే ధ్రువపు ఎలుగుబంట్ల నుంచి సాటి పౌరుల్ని కాపాడేందుకు ఇలా చేస్తారట. కెనడాలోని మనిటోబాలో ఉన్న చర్చిల్‌ ప్రాంతంలో ధ్రువపు ఎలుగుబంట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే, ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి ధ్రువపు ఎలుగుబంట్ల రాజధానిగా కూడా పిలుస్తారు. చూడటానికి ధ్రువపు ఎలుగుబంట్లు అందంగా కనిపించినా.. మనుషుల్ని చంపేసే క్రూర జంతువులు అవి. తరచూ చర్చిల్‌ నగరంలోని జనావాసాల మధ్యలోకి వచ్చి ప్రజల్ని తెగహడలెత్తిస్తుంటాయి. దీంతో వారంతా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఎప్పుడైనా ఎలుగుబంటి ఎదురుపడితే తప్పించుకునే మార్గం కూడా ఉండాలి కదా.. అందుకే, అక్కడి ప్రజలు తమ కార్లను అన్‌లాక్‌లోనే ఉంచుతారు. ఎవరిపైనైనా ఎలుగుబంటి దాడి చేసేందుకు వస్తే వారు సమీపంలోని ఏదో ఒక కారులో ఎక్కి తమని తాము రక్షించుకోవచ్చు.. ఈ విధంగా అక్కడి ప్రజలు పరస్పరం సాయం చేసుకుంటున్నారు.

ఈ ఎలుగుబంట్లు నగరంలోకి రాకుండా ఉండేందుకు అక్కడి కన్జర్వేషన్‌ అధికారులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఆహారం కోసమే అవి నగరంలోకి వస్తుండటంతో వాటికి అవి దొరక్కుండా ఓపెన్‌ ఎయిర్‌ డంప్‌ను మూసివేశారు. ఎలుగుబంట్లు వీధుల్లోకి రాగానే అధికారులకు సమాచారం అందేలా ప్రత్యేక వ్యవస్థను సైతం ఏర్పాటు చేశారు. అయినా, ఇప్పటికీ… ఎలుగుబంట్లు నగరంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. అలా.. ఎలుగుబంట్ల నుంచి తప్పించుకోవడానికి..అక్కడ ప్రజలు ఇలా కార్లను అన్ లాక్ చేసుకుంటుూ.. పరస్పరం సాయం చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news