ఓవైపు నితీశ్ బలపరీక్ష.. మరోవైపు ఆర్జేడీ నేతలపై సీబీఐ దాడులు

-

బిహార్‌లో ఓవైపు కొత్తగా ఏర్పడ్డ మహా గట్‌బంధన్‌ సర్కారు బలపరీక్ష జరుగుతుండగా మరోవైపు ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు జరగడం సంచలనం సృష్టిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ బుధవారం పట్నాలోని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్‌ సింగ్‌ ఇంట్లో తనిఖీలు చేపట్టింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూప్రసాద్‌ యాదవ్‌ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న రోజుల్లో జరిగిన ‘ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌’ కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి.

ఈ తనిఖీలపై సింగ్‌ స్పందిస్తూ..”ఇప్పటికే ఒక సారి తనిఖీలు చేశారు. మళ్లీ చేయడంలో అర్థం లేదు. భయభ్రాంతులను సృష్టించి ఎమ్మెల్యేలను వారికి అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.

ఇదే కుంభకోణానికి సంబంధించి ఆర్జేడీకి చెందిన మరో నేత, ఎంపీ అష్ఫాక్‌ కరీం ఇంటిపై కూడా సీబీఐ నేడు దాడులు నిర్వహించింది. ఈ దాడులపై ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా స్పందిస్తూ “ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు.. భాజపా దాడులు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవి భాజపా కిందే పనిచేస్తాయి. వారి ఆఫీసులను కూడా ఆ పార్టీ స్క్రిప్టే నడిపిస్తుంది. నేడు బిహార్‌ అసెంబ్లీలో బల పరీక్ష ఉంది.. అదే సమయంలో ఇక్కడేం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు” అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news