7 రాష్ట్రాల్లో 10% దాటిన పాజిటివిటీ రేటు.. కేంద్రం అలర్ట్‌

-

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉన్నప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో గత కొన్ని రోజలుగా కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఏడు రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 10శాతం దాటడం కలవరపెడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ వ్యాప్తి కట్టడికి త్వరితగతిన చర్యలు చేపట్టాలంటూ ఆయా రాష్ట్రాలను సూచించింది.

దిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10శాతం దాటింది. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌.. ఆయా రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులకు లేఖలు రాశారు. ‘‘వైరస్‌ వ్యాప్తి కట్టడికి ఐదంచెల వ్యూహాన్ని తప్పనిసరిగా అమలు చేయండి. అర్హులైన ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయండి. కొవిడ్‌ నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడండి’’ అని భూషణ్‌ లేఖలో సూచించారు. రాబోయేవి పండగ రోజులు కావడంతో సామూహిక కార్యక్రమాలు జరుగుతాయని, దీంతో కరోనా కేసులు మరింత పెరిగే ప్రమాదముందని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. అందువల్ల రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

దేశంలో గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో రోజువారీ కేసులు దాదాపు 20వేలుగా నమోదవుతున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 19,406 మందికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వగా.. 49 మరణాలు చోటుచేసుకున్నాయి. దేశ రాజధాని దిల్లీలో ఆరు నెలల తర్వాత మళ్లీ 2వేల కేసులు నమోదవ్వగా.. మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ రోజువారీ కేసుల సంఖ్య రెండు వేలు దాటింది. తమిళనాడు, కేరళల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news