కరెన్సీ నోట్ల మార్పిడితో వ్యాపిస్తున్న కొవిడ్ వైరస్.. బీ కేర్‌ఫులండోయ్‌..!

-

కరోనా వైరస్.. ఈ పేరు చెబితేనే చాలా మంది వణుకుతున్నారు. రోజురోజుకీ ఈ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమందికి కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఒకరి చేతి నుంచి మరొకరి చేతుల్లోకి మారే కరెన్సీ నోట్ల ద్వారా కూడా కొవిడ్ (కరోనా వైరస్) వ్యాప్తి చెందుతుందని సైంటిస్టులు హెచ్చరించడంతో, చైనా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కరెన్సీ నోట్లను బయటకు వెళ్లనివ్వరాదని, నోట్లను తాత్కాలికంగా నిల్వ చేయాలని ఆదేశించింది. ఈ విషయమై చైనా పీపుల్స్ బ్యాంక్ వైస్ చైర్మన్ ఫ్యాన్ యెఫై వివరణ ఇస్తూ, ఇప్పటికే హుబెయ్ ప్రావిన్స్ కు 4 బిలియన్ యువాన్ల కొత్త నోట్లను సరఫరా చేశామని, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకే ప్రభుత్వ బ్యాంకుల్లో నుంచి నోట్లను బయటకు వెళ్లనివ్వరాదని నిర్ణయించామని అన్నారు.

ముఖ్యంగా బ్యాంకులు, మార్కెట్ల నుంచి వచ్చే నోట్లను నిల్వ ఉంచి, వాటిని యూవీ కిరణాల ద్వారా శుభ్రపరిచిన తరువాతే చెలామణిలోకి పంపుతామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలను మరింతగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇక, వైరస్ పై పోరాడేందుకు ఇప్పటికే 534 బిలియన్ యువాన్లను కేటాయించినట్టు చైనా బ్యాంకింగ్, బీమా నియంత్రణ సంస్థ వైస్ ప్రెసిడెంట్ లియాంగ్ టావో వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి రుణాల వసూలును కూడా వాయిదా వేసుకోవాలని బ్యాంకులను ఆదేశించినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news