ఖమ్మం జిల్లాలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు మృతి

-

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుద్దేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ఏటిలో గల్లంతవగా.. గాలించడానికి వచ్చిన సహాయక సిబ్బందిలో ఒకరు నీట మునిగి మృతి చెందారు. మరొకరు గల్లంతయ్యారు. సుద్దేపల్లిలో గ్రామంలో పాలేరు ఏటిపైనున్న చెక్‌డ్యాం కమ్‌ బ్రిడ్జి వద్ద గురువారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. బ్రిడ్జి వద్ద చేపలు పట్టేందుకు.. అదే మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు గురువారం ఉదయం 5 గంటలకు వచ్చారు.

వీరిలో అఫ్జల్‌, పగడాల రంజిత్‌(26)లు చేపలు పడుతూ ప్రమాదవశాత్తూ నీటిలో కొట్టుకుపోయారు. అఫ్జల్‌ను అక్కడ ఉన్న స్థానిక జాలరి ఒకరు క్షేమంగా పైకి లాగారు. నీటిలో మునిగిన రంజిత్‌ కోసం స్థానికులు, బంధువులు గాలించారు. సాయంత్రం 4 గంటలకు స్థానిక ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి సూచనతో మండలాధికారులు ఖమ్మం మున్సిపాలిటీకి చెందిన డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని పిలిపించారు. నలుగురితో కూడిన ఈ బృందం గల్లంతైన రంజిత్‌ కోసం గాలింపు చేపట్టింది.

చెక్‌డ్యాం వద్ద నీటి ప్రవాహ వేగానికి బృంద లీడర్‌ బాశెట్టి ప్రదీప్‌(32), మరో సభ్యుడు పడిగెల వెంకటేశ్వర్లు(29) ఏటిలో కొట్టుకుపోయారు. వీరిలో వెంకటేశ్వర్లు మృతదేహాన్ని స్థానికులు, మిగిలిన బృంద సభ్యులతో కలిసి వెలికితీశారు. ప్రదీప్‌ గల్లంతయ్యారు. ఖమ్మం మున్సిపాలిటీలో స్థానికంగా ‘డీఆర్‌ఎఫ్‌’ పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ విపత్తు నిర్వహణ బృందానికి తగిన శిక్షణ ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news