భ‌య‌పెడుతున్న తితిలీ తుఫాను

-

  • విశాఖ‌, శ్రీ‌కాకుళం జిల్లాల్లో బీభ‌త్సం
  • ఇప్ప‌టిదాకా 8 మంది మృతి
  • అధికారుల‌తో సీఎం టెలికాన్ఫ‌రెన్స్‌
  • ఉత్త‌రాంధ్ర‌కు శాపంగా మారిన అక్టోబ‌ర్ 11

Cyclone Titli Eight people dead in Andhra Pradesh
అమరావతి: అక్టోబ‌రు 11 ఉత్త‌రాంధ్ర‌కు అచ్చిరావ‌డం లేదు. విశాఖ‌ను తుడిచిపెట్టిన హుద్ హుద్ తుఫాను కూడా అక్టోబ‌రు 11నే వ‌చ్చింది. ఇప్పుడు తితిలీ కూడా అక్టోబ‌రు 11నే బీభ‌త్సం సృష్టిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తితలీ ధాటికి గురువారం సాయంత్రం వ‌ర‌కు 8 మంది మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో సముద్రంలో వేటకు వెళ్లి ఆరుగురు చనిపోగా, ఇల్లు కూలి ఒకరు, చెట్టు కూలి మరొకరు మృతి చెందారు.

భ‌య‌పెడుతున్న ఈదురుగాలులు , తీవ్ర పంట‌న‌ష్టం

తితలీ తీరం దాటినా పెనుతుపానుగా కొనసాగుతోంది. ఈశాన్య దిశగా కదిలి తుపానుగా శుక్రవారం బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శ్రీకాకుళంలో గంటకు 135-145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ప్రస్తుతం 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, మరో 6 గంటల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర కోస్తాలోని చాలా చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. విద్యుత్‌, కమ్యూనికేషన్‌, రైల్వేలైన్లకు విఘాతం కలిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుపాను దాటికి కళింగపట్నంలో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మిగిలిన పోర్టులలో ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొవద్దని విశాఖ వాతావరణ కేంద్రం సూచించింది. . కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కేంద్రాల్లోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. కలెక్టరేట్‌ కంట్రోల్‌రూమ్‌ టోల్‌ఫ్రీ నం.180042500002కి ప్రజలు కాల్‌ చేసి సమస్యలు చెప్పాలన్నారు.

Cyclone Titli Eight people dead in Andhra Pradesh

రైళ్లు, విమాన స‌ర్వీసులు ర‌ద్దు
తుపాను కారణంగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి రావాల్సిన ఇండిగో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విమానాయన శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కనుక సుదీర్ఘ దూర ప్రాంతాలకు వెళ్లవలసిన ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించగలరని ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్ పేర్కొన్నారు . తుపాను కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయయని రైల్వే సీనియర్ డివిజనల్ మేనేజర్ సునీల్ కుమార్ తెలిపారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ప్రయాణికులసహాయార్థం 12 హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసామని తెలిపారు. నిన్న 8 రైళ్లు, ఈ రోజు మరో 8 రైళ్లను రద్దు చేసామనీ, 9 రైళ్లను దారి మళ్లించామని వెల్లడించారు. రద్దయిన రైళ్లకు సంబంధించిన 500 మందిప్రయాణికులకు ప్రత్యేక కౌంటర్ ద్వారా ఇప్పటివరకు 6 లక్షల రూపాయలు చెల్లించామని చెప్పారు.

కాల్‌సెంట‌ర్ల నంబ‌ర్లు ఇవే
కాల్‌సెంటర్‌ నంబర్లు : ఈపీడీసీఎల్‌ పరిధిలో 1912, కార్పొరేట్‌ ఆఫీస్‌ పరిదిలో 83310 18762, శ్రీకాకుళం – 94906 12633, 08492-227361, విజయనగరం- 94906 10102, 08922-222942, విశాఖ-72822 99975, 0891-2583611

ఇంట‌ర్ ప‌రీక్ష‌లు వాయిదా
తుఫాను కార‌ణంగా విశాఖ‌, శ్రీ‌కాకులం జిల్లాల్లో జ‌ర‌గాల్సిన ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ప్ర‌భుత్వం వాయిదా వేసింది.

శ్రీకాకుళం జిల్లాలోని వివిధ మండ‌లాల్లో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన‌ వ‌ర్ష‌పాతం వివ‌రాలు
ప‌లాస‌, వ‌జ్ర‌పుకొత్తూరు, నందిగాం -28.02 సెం.మీ
కోట‌బొమ్మాళి- 24.82 సెం.మీ
సంత‌బొమ్మాళి 24.42సెం.మీ
ఇచ్ఛాపురం – 23.76 సెం.మీ
టెక్క‌లి- 23.46 సెం.మీ
సోంపేట‌, మంద‌స – 13.26సెం.మీ
క‌విటి – 12.44 సెం.మీ
పొలాకి- 9.74 సెం.మీ
జ‌లుమూరు 9.06 సెం.మీ
ఎల్ఎన్‌పేట‌-8.92 సెం.మీ
న‌ర‌స‌న్న‌పేట -6.04 సెం.మీ
పొందూరు -5.8 సెం.మీ
లావేరు -4.94 సెం.మీ
శ్రీకాకుళం- 4.62 సెం.మీ
ర‌ణ‌స్థ‌లం-4.58 సెం.మీ
ఎచ్చెర్ల -4.48 సెం.మీ
బూర్జ‌- 4.28సెం.మీ
గార -4.02సెం.మీ

Read more RELATED
Recommended to you

Latest news