దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు

-

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. తాజాగా మరోసారి సోదాలు చేస్తోంది. మద్యం పాలసీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా.. ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు జరుగుతున్నాయి. 25 బృందాలుగా ఏర్పడిన అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దిల్లీకి చెందిన ఈడీ అధికారుల ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి.

ఇంతకు ముందు కూడా దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ హైదరాబాద్‌లో సోదాలు చేసింది. రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. సికింద్రాబాద్ పటేల్ రోడ్డులోని నవకేతన్ భవన్​లో రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ చిరునామా ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

అక్కడికి వెళ్లి తనిఖీ చేసిన ఈడీ అధికారులకు సదరు చిరునామాలో ఓ పేరొందిన బ్యూటీ పార్లర్ ఉన్నట్లు తేలింది. రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్​లో డైరెక్టర్​గా ఉన్న అభిషేక్ రావు సదరు బ్యూటీ పార్లర్ సంస్థలకు డైరెక్టర్​గా ఉన్నారు. రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ ఈమెయిల్ అడ్రస్ సైతం ఒకటేనని ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news