టిక్ టాక్ కొనుగోలు రేసులో గూగుల్.. స్పందించిన సీఈఓ సుందర్‌ పిచాయ్‌

-

ప్రముఖ చైనా వీడియో యాప్‌ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసే ఉద్దేశం గూగుల్‌కు లేదని సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సుందర్‌ పిచాయ్‌ స్పష్టం చేశారు. టిక్‌టాక్‌ సెప్టెంబర్‌ 15లోగా అమెరికాలో కార్యకలాపాలను మూసివేయాలంటూ ట్రంప్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. కాగా, మైక్రోసాఫ్ట్‌, ట్విటర్‌ తదితర అమెరికా సంస్థలు దానిని చేజిక్కించుకునే ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఓ అన్‌లైన్‌ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో.. గూగుల్‌ కూడా ఈ రేసులో ఉందా అనే ప్రశ్నకు పిచాయ్‌ స్పందించారు. ఈ యాప్‌ తమ క్లౌడ్‌ సర్వీసెస్‌ సేవలను ఉపయోగించుకుంటోందని, అందుకు రుసుము చెల్లిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అయితే ఆ సంస్థను కొనుగోలు చేసే ఆలోచనలో గూగుల్‌ లేదని పిచాయ్‌ వెల్లడించారు. గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ గ్రూప్‌ బిడ్‌లో చేరుదామని తొలుత భావించినా.. అనంతరం విరమించుకున్నట్టు తెలిసింది.

తమ వ్యాపారాలపై అమెరికాలో నిషేధం విధించేందుకు అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను సవాలు చేస్తూ టిక్​టాక్​ కోర్టుకెక్కింది. రాజకీయ ఉద్దేశాలతో తమపై నిషేధం విధించాలని చూస్తున్నారనే ఆరోపణలతో.. కాలిఫోర్నియా ఫెడరల్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో ట్రంప్ సహా, కామర్స్ సెక్రటరీ, వాణిజ్య శాఖలను ప్రతివాదులుగా పేర్కొంది టిక్​టాక్​.

Read more RELATED
Recommended to you

Latest news