ప్రకాశం జిల్లాలో‌ మళ్లీ మొదలైన గ్రానైట్ పాలిటిక్స్

-

ప్రకాశం జిల్లా చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్.. ప్రపంచంలో మరెక్కడా దొరకని వెరైటీ రకం. అందుకే దీనికి అంతర్జాతీయ మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రకాశం జిల్లాలో విజిలెన్స్ దాడులతో మూతపడిన ప్రతిపక్ష పార్టీ నేతల క్వారీలతో పాటూ ఖాళీగా ఉన్న గ్రానైట్ క్వారీలను సొంతం చేసుకునేందుకు ఇప్పుడు అధికార వైసీపీ నేతలు పావులుకదుపుతున్నారు. అవకాశం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు ఇదే సమయం అంటు మూతపడిన క్వారీల పై వాలిపోయారు.

చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ పరిశ్రమ ద్వారా ప్రతి యేటా వెయ్యి కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ దొరికే ఈ గెలాక్సీ గ్రానైట్ ను చైనా బయ్యర్లు 90 శాతం కొనుగోలు చేస్తారు. జిల్లాలోని బల్లికురవ మండలంలో స్టీల్ గ్రే గ్రానైట్ కి కూడా డిమాండ్ ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రానైట్ తవ్వకాల జోరుకి కాస్త బ్రేకులు పడ్డాయి. చీమకుర్తి, బల్లికురవ మండలాల్లో ఉన్న గ్రానైట్ క్వారీల్లో రెండు నెలల పాటూ విజిలెన్స్ దాడులు జరిగాయి. ఈదాడుల్లో ప్రతిపక్ష పార్టీ లీడర్లు టార్గెట్ గా మారారు. విజిలెన్స్ దాడులతో ఏడాదిన్నర క్రితం జిల్లాలోని గ్రానైట్ క్వారీలు మూతపడ్డాయి.

విజిలెన్స్‌ దాడులు జరిగిన కొద్దిరోజుల తరువాత అధికార పార్టీ లీడర్ల గ్రానైట్ ఫ్యాక్టరీలు తెరచుకున్నాయి. కానీ ప్రతిపక్ష పార్టీకి చెందిన లీడర్ల క్వారీలు తెరచుకోలేదు. పొలిటికల్ ఒత్తిడులతో మరి కొంత మంది గ్రానైట్ తవ్వకాలు జరపలేక చేతులెత్తేశారు. దీంతో అక్షయపాత్ర లాంటి గ్రానైట్ వ్యాపారంపై.. బీజేపీ, వైసీపీ లీడర్ల కన్ను పడిందట. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ, కేంద్రంలో పవర్‌లో ఉన్న బీజేపీ.. ఆ రెండు పార్టీల లీడర్లు గ్రానైట్ తవ్వకాల కోసం క్యూ కడుతున్నారట. ఇప్పటికే మూతపడిన ప్రతిపక్ష పార్టీ లీడర్ల క్వారీలు టేకోవర్ చేసేందుకు వైసీపీలో ఉన్న ముఖ్య లీడర్లు పావులు కదుపుతున్నారని సమాచారం.

విజిలెన్స్ దాడులతో మూతపడిన క్వారీల్లో తవ్వకాలు జరిపేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నించారట. అలా ప్రయత్నించిన ఒకరిద్దరు మంత్రులకి సీఎం జగన్ నేరుగా వార్నింగ్ ఇచ్చారని అధికార పార్టీలో టాక్ నడుస్తోంది. అయినా మూతపడిన క్వారీలతో పాటూ చీమకుర్తి, బల్లికురవలోని ప్రభుత్వ, ప్రవేటు భూముల్లో గ్రానైట్ తవ్వకాల కోసం అధికార పార్టీ లీడర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారట. అధికార పార్టీ లీడర్లు గ్రానైట్ తవ్వకాల కోసం తహతహలాడుతుండటంతో.. బల్లికురవ మండలంలో భూములు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో పది లక్షలు ఉన్న ఎకరా భూమి విలువ.. ఇప్పడు కోటి, రెండు కోట్లు పలుకుతోంది.

పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు నేతలు ఆరాటపడుతున్నారట. ఉన్న వరకూ గ్రానైట్ తవ్వకాలు జరిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news