కృష్ణా, గోదావరి నదులకు భారీ వరద ప్రవాహం

-

ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి, కృష్ణా నదులకు భారీ ప్రవాహం కొనసాగుతోంది. ఈ సీజన్‌లో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక(53 మీటర్ల మట్టం మించినప్పుడు) దాటి ఉద్ధృత స్థాయిలో గోదావరి ప్రవహించడం ఇది మూడో సారి. బుధవారం సాయంత్రం 54.6 మీటర్ల మట్టంతో 15.08 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. పెరిగిన నీటిమట్టంతో నీట మునిగిన గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రారంభించారు.

ఎగువన కాళేశ్వరం వద్ద కూడా ప్రవాహం ఎక్కువగా ఉంది. అన్ని గేట్లు ఎత్తి తొమ్మిది లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మరోవైపు బుధవారం వరకు గోదావరి నుంచి 3,500 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లింది. కృష్ణా కూడా ఉద్ధృతంగానే ఉంది. శ్రీశైలంలోకి 4.2 లక్షల క్యూసెక్కుల వరద రాగా, 4.6 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు.

బుధవారం రాత్రి 9 గంటలకు శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 3,23,235 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో ఉండగా.. సాగర్‌ 24 క్రస్టుగేట్లతో పాటు కుడి, ఎడమ కాల్వ, ఎస్సెల్బీసీతో కలిపి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌ జలాశయంలో 297.4350 (గరిష్ఠ స్థాయి 312.0450) టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఎన్నెస్పీ అధికారులు పేర్కొన్నారు.
దిగువన పులిచింతలలో నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని సముద్రానికి వదులుతున్నారు. ఇప్పటి వరకూ కృష్ణా నుంచి 220 టీఎంసీల నీరు సముద్రానికి వెళ్లింది.

Read more RELATED
Recommended to you

Latest news