జీవాల్లో.. హిమాంకోసిస్ వ్యాధి.. ముందే గుర్తించకపోతే.. ప్రాణాలకే ముప్పు..!

-

పశువులను పెంచడం అంటే.. కేవలం వాటికి మేత వేయడం, నీళ్లు పెట్టడంతోనే సరిపోదు.. ఒక్కో రకమైన జంతువులకు ఒక్కోరకమైన వ్యాధులు వస్తాయి. వాటిపై ప్రతి యజమానికి కనీస అవగాన ఉండాలి. లేదంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది. లక్షణాలను ముందే గ్రహిస్తే. వైద్యులను సంప్రదించి చికిత్స అందించవచ్చు. గొర్రెలు, మేకల్లో హిమాంకోసిస్ అనే వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనినే రక్తనులి పురుగు అని కూడా పిలుస్తారు. ఇది జీవాల పొట్టలో రక్తం తాగుతూ నివశిస్తుంది. ఈరోజు ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, జీవాలకు ఎలా ప్రమాదాన్ని కలిగిస్తుందో చూద్దాం.

రక్తనులి పురుగు సన్నగా తెల్లగా గుండ్రంగా నూలిపోగులా ఉంటుంది. రోజుకు 0.01మిల్లీ లీటర్ల రక్తాన్ని తాగుతూ వాటి సంతతిని వృద్ధి చెందేలా చేస్తుంది. గుడ్లను పేడ ద్వారా బయటకు విస్తర్జిస్తుంది. ఈ గుడ్లు పేడ ద్వారా బయటకు వచ్చి నేలపై పొదుగుతాయి. తిరిగి లార్వాలా మారి గడ్డి ఆకులకు అతుక్కుని మళ్ళీ మేత ద్వారా గొర్రెలు, మేకల శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇలా జరుగుతుందని రైతులు అస్సలు గ్రహించలేరు కూడా..

ఈ రక్తనులి పురుగులు జీవాల్లో జీవనం సాగిస్తూ వాటి ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిస్తుంటాయి. వీటి ప్రభావం వల్ల గొర్రెల పెరుగుదలకు, మాంసోత్పత్తికి తీవ్ర అవరోధం జరగుతుంది. గొర్రెల్లో వీటి లార్వా వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది..వ్యాధి ముదిరితే జీవాలు చనిపోతాయి. గొర్రె పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. పెద్ద జీవాల్లో రక్తహీనత తప్ప ఇతర వ్యాధి లక్షణాలు పెద్దగా కనిపించవు.

వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయి..

ఆకలి మందగించి మేత, నీరు సరిగా తీసుకోవు.
ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవటానికి ఇష్టపడతాయి.
మందలో వెనుక పడి నిధానంగా నడుస్తూ అడుగులు తడబడుతూ సాగుతుంటాయి.
ఇలాంటి వాటిని గుర్తించి సకాలంలో పశువైద్యులను సంప్రదించి తగిన చికిత్స అందించాలి.. లేకుంటే జీవల ప్రాణాలకే ముప్పు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news